BL Santosh: బీఎల్ సంతోష్ ఫిక్స్ అయినట్లేనా - పక్కా ఆధారాలతో సిట్..!?
BL Santosh in MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కీలక ఆధారాలు సేకరించింది. బీజేపీ ప్రముఖ నేత బీఎల్ సంతోష్ పాత్ర ఖచ్చితంగా ఉందని వాదిస్తోంది. దీనికి సంబంధించి పలు ఆధారాలను సిద్దం చేసింది. ఈ కేసులో ఇప్పటికే నిందితుడుగా ఉన్న రామచంద్ర భారతి - బీఎల్ సంతోష్ మధ్య జరిగిన ఫోన్, వాట్సప్ సంభాషణలను సిట్ సేకరించింది. వీటిని కోర్టుకు సిట్ అధికారులు అందచేసారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి..ఏం జరిగిందనే దాని పైన ఫొటోలను కోర్టుకు సమర్పించింది. దీంతో, ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో కీలక పరిణమాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.
అంతా సంతోష్ కు తెలిసే..
ముగ్గురు నిందితుల నుంచి సేకరించిన సమాచారం తో బీఎల్ సంతోష్ కు తెలిసే ఇదంతా జరిగిందనే అభిప్రాయానికి సిట్ అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆయన ప్రమేయాన్ని రుజువు చేసే పక్కా ఆధారాలను ఇప్పటికే సిద్దం చేసుకుందని సమాచారం. సిట్ విచారణ ఎదుర్కొంటున్న నిందితుల్లో ఒకరైన రామచంద్ర భారతి - బీఎల్ సంతోష్ మధ్య పలు సందర్భాల్లో చోటు చేసుకున్న ఫోన్ - వాట్సప్ సంభాషణలను సిట్ సేకరించింది. సంతోష్ తో రామచంద్ర భారతి హరిద్వార్ లో భేటీ అయిన ఫొటోలను సంపాదించింది. అక్టోబరు 15న బీఎల్ సంతోష్ అధికారిక నివాసంలో ఉదయం 10 గంటలకు జరిగిన సమావేశంలో తుషార్ వళ్లెపల్లి, రామంద్ర భారతి, నందు, విజయ్ పాల్గొన్నట్లుగా ఆధారాలతో సహా సిట్ నిర్దారించినట్లు తెలుస్తోంది.
సాంకేతిక ఆధారాలతో సిట్..
నిందితుల విచారణ సమయంలో సేకరించిన సమాచారం.. సాంకేతికంగా సంపాదించిన ఆధారాలతో సిట్ ముందుకు వెళ్తుంది. సెల్ఫోన్ లొకేషన్లను సేకరించిన సిట్ సాంకేతికంగా బలమైన ఆధారం సేకరించింది. ఆ సమయంలో తీసిన వీడియో, ఫొటోలను కూడా సిట్ స్వాధీనం చేసుకుంది. సెప్టెంబరు 26న హైదరాబాద్లోని నందు నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. అంతకు ముందు రామచంద్ర భారతి, సింహయాజి, న్యాయవాది పి. ప్రతాప్ ఆగస్టు 21న ఢిల్లీలోని వరల్డ్ బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు కేసీ పాండే నివాసంలో సమావేశమైన విషయాన్ని న్యాయవాది ప్రతాప్ నిర్ధారించడంతోపాటు కీలక విషయాలు వెల్లడించారు. సెప్టెంబరు 4న మరోసారి రామచంద్ర భారతి, నందు, సింహయాజి, న్యాయవాది శ్రీనివాస్ సమావేశమయ్యారు. సిట్ సేకరించిన వాట్సప్ ఛాటింగ్ ల ఆధారాల్లో పలు పేర్లు గుర్తించింది. ఈ కేసులో వారి ప్రమేయం ఎంత వరకు ఉందనే కోణంలో ఆరా తీస్తోంది.
కాంగ్రెస్ నేతలతో సింహయాజి మంతనాలు..
సిట్ విచారిస్తున్న ముగ్గురు నిందితుల్లో ఒకరుగా ఉన్న సింహయాజీ హైదరాబాద్ కేంద్రంగా పలువురితో భేటీలు నిర్వహించారు. హైదరాబాద్లోని స్కై హై హోటల్లో ప్రొ. కోదండరామ్తోను, కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్ రాజనర్సింహతోను, మరికొందరితో కూడా సమావేశమైనట్లు గుర్తించారు. ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న వారితో పాటుగా నిందితులుగా చేర్చిన వారు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం పైన ఎక్కడ ఎప్పుడు సమావేశమయ్యారనేది పూర్తి ఆధారాలను సిట్ సేకరించిందని తెలుస్తోంది. బీఎల్ సంతోష్ ప్రస్తుతం హైకోర్టు మినహాయింపుతో విచారణకు హాజరు కాలేదు. కానీ, వచ్చే వారం ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.