Road Accident: నల్గొండలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు... ఆరుగురు అక్కడికక్కడే మృతి
నల్గొండ జిల్లాలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. ఈ రెండు ప్రమాదాలు కట్టంగూర్ మండలం ముత్యాలమ్మ గూడెం సమీపంలోనే చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ కారు వేగంగా దూసుకొచ్చి మొదట ఓ కంటైనర్ను... ఆపై చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ముత్యాలమ్మగూడెం సమీపంలోనే జరిగిన మరో ప్రమాదంలో... ఆగి ఉన్న ఓ లారీని కారు వెనక నుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులను నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొద్ది గంటల వ్యవధిలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాలతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కట్టంగూర్ పోలీసులు ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేస్తున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటీవలి కాలంలో వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గత నెల ఆగస్టు 28న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ధర్మోజిగూడెం సమీపంలో లారీ-బైక్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వేంబ్రిడ్జి వద్ద లారీని రివర్స్ చేస్తుండగా... అది రోడ్డుపైకి రావడంతో... వెనుక నుంచి వచ్చిన బైక్ బలంగా ఢీకొట్టింది. లారీ సడెన్గా రోడ్డు పైకి రావడంతో బైక్ ఢీకొట్టినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో చిట్యాల మండలం పిట్టంపల్లికి చెందిన హరీశ్,హైదరాబాద్లోని రామాంతపూర్కి చెందిన మరో ఇద్దరు యువకులు మృతి చెందారు. బైక్పై ముగ్గురు పిట్టంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన ముగ్గురు యువకులు ఏసీ మెకానిక్లుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు.
గత నెలలోనే ఇదే నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ చింతపల్లి హైవే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న లారీని శ్రీ కృష్ణ ట్రావెల్స్కు చెందిన ఓ బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరో పది మంది కి తీవ్ర గాయాలు అయ్యాయి.మృతులను మల్లికార్జున్(40),నాగేశ్వర్రావు(44),గుంటూరు జిల్లాకు చెందిన జయరావ్(42)లుగా గుర్తించారు.శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.క్షత గాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆ ప్రమాదంలో 9 మంది మృతి :
ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్-నాగార్జున సాగర్హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది వ్యవసాయ కూలీలు మృతి చెందిన సంగతి తెలిసిందే. పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ఆటోలో దాదాపు 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఐదుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా... మిగతా నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరంతా పీఏపల్లి మండలం రంగారెడ్డి గూడెంలో వరి నాట్లు వేసేందుకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు.
మార్గమధ్యలో ఓ బొలెరో వాహనం అదుపు తప్పి ఆటో వైపు దూసుకొచ్చింది. దాన్ని తప్పించేందుకు ఆటో డ్రైవర్ మల్లేశం... వాహనాన్ని రోడ్డు మధ్యకు తిప్పాడు.దీంతో అటుగా వస్తున్న లారీ ఆటోను అతివేగంతో ఢీకొట్టింది. దీంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జవగా కూలీలంతా చెల్లాచెదురుగా చెడిపోయి ఆ ప్రాంతం రక్తసిక్తంగా మారింది. కూలీలంతా మరో అరగంటలో ఇల్లు చేరుతారనగా ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడం అందరినీ కలచివేసింది.ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతిచెందిన కూలీల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయాల పాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.