బీజేపీ నేతలకు తలనొప్పిగా కేసీఆర్పై స్కిట్.. బండి సంజయ్కి పోలీసుల నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిని మించి ఒకరు మాటల తూటాలను పేలుస్తున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుండే పొలిటికల్ హీట్ ను మరింత పెంచుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికార టిఆర్ఎస్ కు, బిజెపికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి నేతలపై అనేక సందర్భాలలో ప్రభుత్వం కేసులు పెట్టడం ప్రధానంగా కనిపిస్తుంది.
ఇక తాజాగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు హయత్ నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను, ప్రభుత్వ పథకాలను కించపరచినందుకు బీజేపీ నేతలు ఇప్పటికే జిట్టా బాలకృష్ణా రెడ్డి పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బిజెపి నేతలు రాణిరుద్రమ, దరువు ఎల్లన్నలను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా బండి సంజయ్ కు నోటీసులు జారీ చేశారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాగోల్ బండ్లగూడ లో ఏర్పాటు చేసిన అమరుల యాది సభలో కెసిఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా చేసిన స్కిట్ విషయంలో పోలీసులు బండి సంజయ్ కు నోటీసులిచ్చారు. హయత్ నగర్ పోలీసులు నోటీసులు జారీ చేసి దీనిపై బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. గత నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి జిట్టా బాలకృష్ణా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో బిజెపి నేతలు తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇక తాజాగా బండి సంజయ్ కు నోటీసులు జారీ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టలేదు అని అర్థమవుతుంది. బీజేపీ నేతలకు తలనొప్పిగా కేసీఆర్పై ఆ స్కిట్ మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే తెలంగాణా జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాటు నేపధ్యంలో బిజీగా ఉన్న బీజేపీ నేతలకు ఈ వ్యవహారం ఇబ్బందిగా మారింది. ఇక ఈ వ్యవహారంలో బండి సంజయ్ ఏ విధంగా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది.