KTRపై సోషల్ మీడియాలో ట్రోలింగ్!
తెలంగాణలో ఉప ఎన్నికలేవీ లేవనుకుంటున్న తరుణంలో మునుగోడు రూపంలో మరో ఉప ఎన్నిక ముంచుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరఫున గత ఎన్నికల్లో విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ తరఫున టికెట్ సంపాదించి బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్వాయి స్రవంతి, అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అతనికి ప్రత్యర్థులుగా నిలిచారు.

గెలుపు తమదే అంటున్న టీఆర్ఎస్!
దుబ్బాక, హుజూరాబాద్ తరహాలో ఇక్కడ విజయం సాధించి తెలంగాణ ప్రజలంతా బీజేపీవైపే ఉన్నారని చెప్పుకోవడానికి ఇక్కడ గెలవడం ఆ పార్టీకి, కోమటిరెడ్డికి అనివార్యంగా మారింది. దీనికోసం కోమటిరెడ్డి చెమటోడుస్తున్నారు. చివరి నిముషంలో ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసిన కేసీఆర్ గెలుపు తమదేననే ధీమాను వ్యక్తపరిచారు.
ఆయన నామినేషన్ కు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. రాజకీయంగా ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా సమర్థవంతంగా డీల్ చేయగలిగిన రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్న కల్వకుంట్ల తారక రామారావు తొలిసారిగా తడబడినట్లుగా కనిపించారు. ఇప్పుడు అదే విషయమై సోషల్ మీడియాలో కేటీఆర్ పై ట్రోలింగ్ జరుగుతోంది.

సిరిసిల్ల తరహాలో అభివృద్ధి చేస్తా?
నామినేషన్ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానంటూ హామీ ఇచ్చారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం తరహాలో సమీక్షలు చేయడంతోపాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానన్నారు. ఇప్పుడు ఈ విషయంపైనే కేటీఆర్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.

మీరు రాష్ట్రం మొత్తానికి మంత్రి సార్!
టీఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గాలనే అభివృద్ధి చేస్తారా? అని కొందరు కామెంట్ చేస్తుంటే మరికొందరు.. సిరిసిల్ల ఒక్కటే కాదు సార్.. మీరు రాష్ట్రం మొత్తానికి మంత్రి అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇంకొందరు మునుగోడులో అభివృద్ధి అందుకే ఆగిపోయిందా? అని అడిగారు. పార్టీ కార్యకర్తగా కాకుండా మంత్రిగా ఆలోచించండి సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కేటీఆర్ లాంటి వ్యక్తి కూడా నెటిజన్ల ట్రోలింగ్ కు గురయ్యారు.












Click it and Unblock the Notifications