భర్తకు దూరమైంది: నమ్మించి చోరీలు చేయడంలో ఈ లేడీ దిట్ట
హైదరాబాద్: ఇంట్లో చోరీ చేయడంతో ప్రారంభమైన ఓ మహిళ నమ్మించి మోసం చేయడంలో ఆరి తేరింది. అలా చోరీలకు పాల్పడుతున్న మహిళ పోలీసుల చేతికి చిక్కింది. ఇళ్లలో నమ్మకం కలిగించే విధంగా పనిచేస్తూ విలువైన వస్తువులతో పరారయ్యే ఆ మహిళను హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టుచేశారు.
అందుకు సంబంధించిన వివరాలను బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్కుమార్రెడ్డి సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. గుంటూరు జిల్లా గురజాల మండలం రెంటచింతలకు చెందిన ఎరువ మేరీ సునీత(38) మెహదీపట్నం అయోధ్యనగర్లో నివసిస్తోంది. నర్సింగ్ పూర్తిచేసిన సునీత ఎవరికైనా వృద్ధులకు ఇంట్లో ఉండి ఆసరాగా నిలవడానికి వయోవృద్ధుల కేంద్రాల్లో పేరు నమోదు చేయించుకుంటుంది.
జూబ్లీహిల్స్ రోడ్ నం.44లో నివసించే రత్న అనే మహిళ ఇంట్లో నర్సింగ్, వ్యక్తిగత సేవలందించేందుకు పనికి కుదిరింది. ఈనెల 9న 12 తులాల ఆభరణాలతో సునీత పరారైంది. 1954లో తాను తయారుచేయించుకున్న 8 తులాల మంగళసూత్రం కూడా అందులో ఉంది. దాంతో రత్న పోలీసులను ఆశ్రయించింది.
సునీత పట్టుబడ్డంతో ఆ నగలు లభించాయి. అయిదు కేసుల్లో సునీతకు జైలు శిక్ష పడింది. ఆమె 13 కేసుల్లో నిందితురాలిగా ఉంది. ఏప్రిల్ 30న అబిడ్స్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒకరి ఇంట్లో పనికి కుదిరి ఐప్యాడ్, రూ.15వేలు దోచుకుంది. ఈనెల 23న ఎస్సార్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓంకార్ నర్సింగ్ సర్వీసెస్లో పనిచేస్తూ ల్యాప్టాప్, రూ.3వేల నగదు చోరీ చేసింది.
ఎస్సార్నగర్, తిరుమలగిరి, బంజారాహిల్స్, ఓయూ సిటీ, తుకారాం గేట్, మాదాపూర్, సైఫాబాద్, రాంగోపాల్పేట ఠాణాలలో 2009-14 మధ్యలో పది కేసులు నమోదయ్యాయి. సోమవారం సునీతను అరెస్ట్ చేసి రూ.4.5లక్షల విలువైన నగలతోపాటు ల్యాప్టాప్, ఐప్యాడ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. పీడీ చట్టాన్ని నమోదు చేసే అవకాశాలను పరిశీలిస్తామన్నారు.
సొంత ఇంటికి కన్నమేసి, సునీత ఎనిమిదేళ్ల క్రితమే తన సొంత ఇంట్లో రూ.లక్ష దొంగతనం చేసింది.పలు ఆసుపత్రులలో పనిచేసేది. జల్సాగా జీవించేందుకు చోరీల బాట పట్టింది.