బాబు సరే.. గెలిపిస్తే కెసిఆర్ ఏం చేశారు, సన్నాసి తడబడ్డాడు: టిడిపి
హైదరాబాద్: మంత్రి జూపల్లి కృష్ణా రావుకు తెలుగుదేశం పార్టీ గురువారం నాడు కౌంటర్ ఇచ్చింది. పాలమూరు ఎంపీగా గెలిచి ఎంపీ కోటా నిధులను ఖర్చు చేయకుండా, వలసలను నిరోధిస్తానని చెప్పి చేయనందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ను తొలుత జూపల్లి ప్రశ్నించాలని టిడిపి అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి అన్నారు.
పాలమూరును దత్తత తీసుకొని చంద్రబాబు ఏం చేశారని జూపల్లి ప్రశ్నించిన విషయం తెలిసిందే. చంద్రబాబు హయాంలో వచ్చిన ప్రాజెక్టులపై, కేటాయించిన నిధులపై చర్చించేందుకు తాము సిద్ధమని రావుల, ఇతర టిడిపి నేతలు చెప్పారు.
పాలమూరును దత్తత తీసుకొని చంద్రబాబు ఏం చేశారో చెబుతామని టిడిపి నేతలు చెబుతున్నారు. అదే సమయంలో వారు ఓ పాయింట్ లేవనెత్తారు. పాలమూరు ఎంపిగా గెలిచిన కెసిఆర్ అసలు ఏం చేశారో చెప్పాలని నన్నూరి నిలదీశారు.
జూపల్లి తొలి సవాలులోనే తడబడ్డ సన్నాసి అని నన్నూరి అన్నారు. చంద్రబాబు హయాంలో భీమా ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కేటాయించలేదని, కేటాయించినట్లు నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేశారని, ఆ తర్వాత రూ.17 కోట్లు ఇచ్చారని చెప్పి తొలి సవాలులోనే జూపల్లి తడబడ్డారన్నారు.
పాలమూరు ప్రాజెక్టుల కోసం ఎవరి హయాంలో ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని జూపల్లికి టిడిపి నేత పెద్ది రెడ్డి సూచించారు. జూపల్లి శాఖకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, టీవీల్లో కనబడారని ఆయన రాద్ధాంతం చేస్తున్నారన్నారు. చర్చకు తాము వెనుకడుగు వేసేదే లేదన్నారు. శ్వేతపత్రం విడుదల తర్వాతే తాము చర్చకు వస్తామని రావుల చంద్రశేఖర రెడ్డి చెప్పారు.
సచివాలయం వద్ద కాంగ్రెస్ మెరుపు ధర్నా
తెలంగాణ సచివాలయం వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం మెరుపు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో దానం నాగేందర్, షబ్బీర్ అలీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి, దానం నాగేందర్, వి హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్మికులకు జీతాలు పెంచితే తప్పేమిటని ప్రశ్నించారు. కార్మికులు న్యాయపరమైన డిమాండ్లు చేస్తున్నారన్నారు.