మాజీ మంత్రి మెట్ల కన్నుమూత: అధికారిక లాంఛనాలతో రేపు అంత్యక్రియలు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు.
ఆయన మృతదేహాన్ని అమలాపురం తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, 1996 నుంచి 1999 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో మెట్ల సత్యనారాయణ ఆరోగ్యమంత్రిగా పనిచేశారు. అమలాపురం శాసనసభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఇటీవలే ఆయన ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు పరామర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవలే జాతీయ పార్టీగా అవతరించిన తెలుగుదేశం కమిటీలను ప్రకటించినప్పుడు ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను ఉపాధ్యక్ష పదవిని ఇచ్చారు.
మెట్ల సత్యనారాయణ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పలువురు టీడీపీ నేతలు సంతాపం తెలిపారు.
అనారోగ్యంతో కన్నుమూసిన మాజీమంత్రి మెట్ల సత్యనారాయణకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శనివారం మెట్ల స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మెట్ల అంత్యక్రియలు జరుగనున్నాయి.