పాతమిత్రులు కలుస్తారా : సిపిఎం పాదయాత్రకు టిడిపిమద్దతు
హైదరాబాద్ : సిపిఎం తలపెట్టిన మహాజన పాదయాత్రకు టిడిపి మద్దతు ప్రకటించింది.ఈ మేరకు తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కు ఫోన్ చేసి మద్దతును తెలిపారు.నవంబర్ 1వ, తేదిన టిడిపి ముఖ్యనాయకులు పాదయాత్రలో పాల్గొననున్నారు.పాతమిత్రుల మద్య పొత్తు పొడుస్తోందా అనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.
ఐదుమాసాల పాటు సుమారు 4 వేల కిలోమీటర్ల పాటు మహాజన పాదయాత్రను సిపిఎం చేపట్టింది.ఈ పాదయాత్రలో స్థానికంగా టిడిపి నాయకులు మద్దుతు తెలుపుతున్నారు.శుక్రవారం నాడు ఎన్ టిఆర్ ట్రస్టు భవన్ లో టిడిపి ముఖ్యనాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సిపిఎం మహాజన పాదయాత్ర పై చర్చించారు.పాదయాత్రకు మద్దతును తెిపారు. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తో టిడిపివర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు. పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నవంబర్ 1వ, తేదిన పాదయాత్రలో తమ పార్టీ నాయకులు పాల్గొంటారని రేవంత్ ప్రకటించారు.
రైతుల సమస్యలపై సంయుక్తంగా పోరాటం చేద్దామని రేవంత్ సిపిఎం నేతలకు పిలుపునిచ్చారు.నవంబర్ 1వ, తేదిన తిమ్మాజీపేటలో తాము పాదయాత్రలో పాల్గొంటామని రేవంత్ చెప్పారు.ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘకాలంపాటు టిడిపి వామపక్షాలు మిత్రపక్షాలుగా ఉన్నాయి.2009 ఎన్నికల్లో ఈ పార్టీలు కలిసి పోటీచేశాయి.2014 ఎన్నికల్లో టిడిపి బిజెపితో కలిసి పోటీచేయగా, సిపిఎం స్థానికంగా ఉన్న అవసరాల మేరకు పొత్తులను కుదుర్చుకొంది.
రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వామపక్షాలతోనే పొత్తులు పెట్టుకోవాలని సిపిఎం మహాసభ లో తీర్మానం చేసింది.ఈ తీర్మాణం మేరకు వరంగల్ ఉప ఎన్నికల్లో వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపింది సిపిఎం.భవిష్యత్తులో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ రాజకీయశక్తుల ఏకీకరణ కోసం సిపిఎం ప్రయత్నిస్తోంది.లోక్ సత్తా వామపక్షాలతో కలిసి రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తోంది.పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేనతో కలిసి పోటీచేయాలనే అభిప్రాయాలు కూడ వామపక్షాల్లో ఉన్నాయి.అయితే వీటిపై ఇప్పటికిప్పుడు నిర్ణయించలేమని రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు.
రాష్ట్రంలో సిపిఎం పాదయాత్ర ప్రారంభించే సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సిపిఎం నాయకులను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. సిపిఎం నాయకులు కూడ కెసిఆర్ పై ఎదురుదాడికి దిగారు.టిఆర్ఎస్ పై టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడ ఒంటికాలిపై విమర్శలు చేస్తుంటాడు. అవకాశం దొరికినప్పడల్లా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తుంటాడు.శత్రువుకు శత్రువు మిత్రుడనే చందంగా సిపిఎం పాదయాత్రకు టిడిపి మద్దతిస్తోందా అనే చర్చ కూడ లేకోపలేదు. మరో వైపు వామపక్షాలను తమవైపుకు నిలుపుకొనేందుకు టిడిపి ప్రయత్నిస్తోందా అనే చర్చకూడ లేకపోలేదు.
సుదీర్ఘకాలంపాటు మిత్రపక్షాలుగా ఉన్న టిడిపి సిపిఎం లు ల మద్య పాదయాత్ర పాత సంబందాలను పునరుద్దరిస్తోందా.....పాదయాత్ర వరకే మద్దతు పరిమితం కానుందా అనేది భవిష్యత్ నిర్ణయిస్తోంది.