తెలంగాణ అసెంబ్లీ రద్దు.. జస్ట్ 2 నిమిషాల్లో: కేసీఆర్ సంచలన నిర్ణయం, ఇదీ విషయం!
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ప్రభుత్వాన్ని గురువారం రద్దు చేశారు. గత కొద్ది రోజులుగా కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారని, ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే. 2019 లోకసభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు ఆయన అసెంబ్లీని రద్దు చేశారని అంటున్నారు.
డిసెంబర్లోపు ఎన్నికలు జరగాలంటే: మంత్రులకు కేసీఆర్ ఫోన్లు, బస్సులో ప్రయాణం
అంతకుముందు, ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం జరిగింది. మంత్రులు అందరూ హాజరయ్యారు. అసెంబ్లీ రద్దుపై నిర్ణయాన్ని ఏకవ్యాఖ్య తీర్మానంతో ఆమోదించారు. అనంతరం రాజ్ భవన్లో గవర్నర్కు కేబినెట్ తీర్మానాన్ని సమర్పించారు.
గవర్నర్తో కేసీఆర్ భేటీ
ప్రగతి భవన్లో అసెంబ్లీ రద్దుపై కేబినెట్ తీర్మానం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు బస్సులో రాజ్ భవన్ బయలుదేరారు. గవర్నర్కు తీర్మానం సమర్పించిన అనంతరం, తాము అసెంబ్లీని ఎందుకు రద్దు చేస్తున్నామో కేసీఆర్ ఆయనకు క్లుప్తంగా చెప్పారు. గవర్నర్తో ఆయన దాదాపు ఇరవై నిమిషాలకు పైగా భేటీ అయ్యారు. ప్రభుత్వ రద్దు తీర్మానాన్ని ఆమోదించిన గవర్నర్.. ఆపద్ధర్మ సీఎంగా ఉండాలని కేసీఆర్ను కోరారు.
కేవలం 2 నిమిషాల్లోనే
అసెంబ్లీ రద్దు కోసమే మధ్యాహ్నం కేబినెట్ భేటీ జరిగింది. కేవలం 2 నిమిషాలే ఈ సమావేశం జరిగిందని తెలుస్తోంది. ఈ సమావేశంలో నిర్ణయించిన సమాయానికి కేసీఆర్ అసెంబ్లీ రద్దు తీర్మానంపై సంతకం చేశారు. రెండు నుంచి 4 నిమిషాల మధ్య భేటీ జరిగిందని అంటున్నారు. కేసీఆర్ తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేశారు.
అసెంబ్లీ రద్దుకు పలు కారణాలు
కేసీఆర్ అసెంబ్లీ రద్దు వెనుక పలు రాజకీయ కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఒకటి.. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్న నేపథ్యంలో ముందస్తు మంచిదని కేసీఆర్ భావించారని అంటున్నారు. రెండోది.. 2019 లోకసభ ఎన్నికల అనంతరం బీజేపీతో కలిసి వెళ్లాలని అనుకుంటున్నారని, అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే తమకు దెబ్బ పడుతుందని కేసీఆర్ భావించారని, మూడోది... ఇప్పుడు ముందస్తు వస్తే లోకసభ ఎన్నికల సమయంలో పార్లమెంటు ఎన్నికలపై అలాగే జాతీయస్థాయిలో దృష్టి సారించవచ్చునని భావిస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్ 4 సంవత్సరాల 3 నెలల 4 రోజులు సీఎంగా ఉన్నారు.
పలువురు అభ్యర్థుల ప్రకటన
పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను, పలు నియోజకవర్గాల ఇంచార్జులను కేసీఆర్... టీఆర్ఎస్ భవన్ రావాలని పిలిచారు. ఈ రోజే పలువురు అభ్యర్థులను ఆయన ప్రకటిస్తారు. ఆయా నియోజకవర్గ ఇంచార్జులను కూడా అభ్యర్థులుగా ప్రకటిస్తారు.