తెలంగాణ అసెంబ్లీలో 3న గవర్నర్ ప్రసంగం: బడ్జెట్ 6న, కీలక పరిణామాలు
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. ఇక, ఫిబ్రవరి 6వ తేదీన రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నార
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గవర్నర్ ప్రసంగం ఉండాలన్న తాజా నిర్ణయం నేపథ్యంలో మంత్రులు, పలువురు ఉన్నత అధికారులతో సీఎంకేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. మరోవైపు, పుదుచ్చేరి పర్యటనకు వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
బడ్జెట్ సమావేశాలపై సీఎం కేసీఆర్ సమాలోచనలు
కాగా, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులతో సమాలోచనలు జరిపారు. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి హరీశ్ రావు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, పలువురు అధికారులు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగంతోపాటు బడ్జెట్ సమావేశాల తేదీలపై కీలకంగా చర్చించారు.
గవర్నర్ను కలిసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, కీలక చర్చ
ఈ క్రమంలో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్థిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ను కలిశారు. ప్రగతిభవన్లో సీఎంతో చర్చల అనంతరం వీరు రాజ్భవన్ వెళ్లి గవర్నర్ తమిళిసైతో సమావేశమయ్యారు.
ఉభయ సభల్లో ప్రోరోగ్, తిరిగి సమావేశమయ్యేందుకు నోటిఫికేషన్, గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిఫారసు తదితర అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. బడ్జెట్ ప్రసంగం కోసం గవర్నర్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇందుకు గవర్నర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
3న గవర్నర్ ప్రసంగం: 6న తెలంగాణ బడ్జెట్
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇదే రోజు గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. ఇక, ఫిబ్రవరి 6వ తేదీన రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
6వ తేదీని ఉదయం 10.30 గంటలకు బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టనున్నారు. కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని అంచనా.