ట్రాఫిక్ క్లియర్, బుల్లెట్ ప్రూఫ్ కారు?: జగన్ కోసం తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం!
Recommended Video
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికు తెలంగాణ ప్రభుత్వం భద్రతను పెంచింది. విశాఖపట్నం విమానాశ్రయంలో శ్రీనివాస రావు అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం వైయస్ జగన్ పైన హత్యాయత్నం చేసిన విషయం సంచలనం రేపింది. దీనిపై విచారణ సాగుతోంది. ఆయన హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స తీసుకొని, ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలో పాదయాత్ర కూడా ప్రారంభించనున్నారు.
జగన్కు పటిష్ట భద్రత, బుల్లెట్ ప్రూఫ్ కారు
జగన్ పైన దాడి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆయన భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జగన్కు పటిష్ట భద్రత కల్పించడమే కాకుండా ఆయన ఇంటి వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. అలాగే జగన్కు బుల్లెట్ ప్రూఫ్ కారును ప్రభుత్వం కేటాయించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
కాంగ్రెస్తో దోస్తీ, జగన్ను దెబ్బతీసేందుకు బాబు వ్యూహం!: పవన్కు ప్లస్, జనసేనతో టచ్లో కీలక నేతలు
భద్రతపై ఆదేశాలు
జగన్కు భద్రత పెంచాలని పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులో ఉన్న ఆయనకు భద్రతను పెంచారు. అయితే జగన్కు బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చినట్లుగా తెలుస్తోందని, వార్తలు రాగా, పోలీసు ఉన్నతాధికారులు దానిని ఖండించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వలేదని
జగన్కు బుల్లెట్ ప్రూఫ్ కారు సమకూర్చినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పోలీసు ఉన్నతాధికారులు చెప్పినట్లు సాక్షి వెబ్ మీడియాలో వచ్చింది. కొన్ని టీవీఛానళ్లలో వచ్చిన వార్తలను వారు ఖండించారని, ఏపీ నుంచి హైదరాబాదులోని తన నివాసానికి జగన్ వచ్చే సమయంలో మాత్రం రాష్ట్ర పోలీస్ శాఖ తరఫున ఎస్కార్ట్ ఇస్తున్నట్లు తెలిపారు. జగన్కు ఏపీ ప్రభుత్వమే వాహనం సమకూర్చాల్సి ఉంటుందని, తమకు సంబంధం లేదని తెలిపినట్లుగా అందులో పేర్కొన్నారు.
జగన్ కోసం కొత్త నిర్ణయం
జగన్కు భద్రత విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. హైదరాబాదులో ఆయన ప్రయాణిస్తుంటే ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చూడాలని ఆదేశాలు వచ్చాయట. జగన్ కాన్వాయ్ వేగంగా గమ్యాన్ని చేరుకునేందుకు ఈ రూట్ క్లియరెన్స్ సహకరిస్తుంది. గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు, నాయిని నర్సింహా రెడ్డి తదితరులు వచ్చినప్పుడు రూట్ క్లియరెన్స్ చేస్తారు. ఈ జాబితాలో జగన్ కూడా చేరారట. అయితే జగన్ కాన్వాయ్ కోసం ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు ఉండవని, ఆయన ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ జామ్ కాకుండా మాత్రమే చూస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారట.