సురభి వాణీదేవికి లక్కీ ఛాన్స్: కేసీఆర్ కేబినెట్లో చోటు?: త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?
హైదరాబాద్: తెలంగాణలో త్వరలో మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ.. చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయా?, ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులపై వేటు పడబోతోందా?, వారి స్థానంలో కొత్త ముఖాలకు అవకాశం లభిస్తుందా?, అదే జరిగితే ఎవరా అదృష్టవంతులు?.. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోన్న భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనడానికి కేబినెట్ను మరింత బలోపేతం చేయాలని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు భావిస్తున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. తన కేబినెట్ను మరింత శక్తిమంతం చేసుకోవాలని గులాబీ బాస్ తీర్మానించుకున్నారని సమాచారం.
రెండు ఎమ్మెల్సీలు గెలిచినా..
తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఆవిర్భవిస్తోందనేది బహిరంగ రహస్యం. సిద్ధిపేట్ జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు..ఈ విషయాన్ని తేటతెల్లం చేశాయి. ఈ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ తన స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయింది. ఈ రెండింటి తరువాత ఎదురైన రెండు శాసన మండలి పట్టభద్ర ఎన్నికల్లోనూ కమలనాథులు.. టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇవ్వగలిగారు. ఈ రెండు స్థానాలను గులాబీ పార్టీ తన ఖాతాలో వేసుకోగలిగినప్పటికీ..ప్రభుత్వ పెద్దలకు ఈ ఫలితాలు పూర్తిస్థాయి ఆనందాన్ని ఇవ్వలేదనే అంటున్నారు.
నాగార్జున సాగర్ ఫలితం మీదే ఫోకస్..
ప్రస్తుతం టీఆర్ఎస్ తన దృష్టి మొత్తాన్నీ నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికపై కేంద్రీకరించింది. తిరుగులేని మెజారిటీని సాధించాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. ఆ దిశగా పార్టీ శ్రేణులన్నింటినీ బరిలోకి దింపింది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం పునరావృతం కాకుండా.. అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది. కన్నుమూసిన సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ను గెలిపించుకోవడానికి సర్వశక్తులనూ ఒడ్డుతోంది. ఈ నెల 17వ తేదీన ఈ ఉప ఎన్నిక పోలింగ్ అనంతరం.. కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు పూనుకుంటారనే ప్రచారం సాగుతోంది.
27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం తరువాతే..
ఈ నెల 27వ తేదీన టీఆర్ఎస్ అవిర్భావ దినోత్సవం ఉంటుంది. తన 20 వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించుకోనుంది.. టీఆర్ఎస్. ఈ సందర్భంగా మూడురోజుల పాటు ప్లీనరీని నిర్వహించాలని పార్టీ అగ్ర నాయకత్వం భావిస్తోంది. ఆ వెంటనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే ప్రచారం తెలంగాణలో ఉంది.
మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహారావు కుమార్తె, కొత్తగా శాసన మండలికి ఎన్నికైన సురభి వాణీదేవిని కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. కొత్తగా శాసనమండలికి ఎన్నికైనప్పటికీ.. ఆమెకు ఉన్న కుటుంబ నేపథ్యం, సామాజిక వర్గాన్ని పరిగణనలోకి తీసుకుని కేబినెట్ బెర్త్ కల్పిస్తారని సమాచారం.
ఎవరా దురదృష్టవంతులు?
కాగా- ఆశించిన స్థాయిలో పనితీరును కనపర్చలేని ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులపై వేటు తప్పకపోవచ్చని చెబుతున్నారు. 2023 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. కేబినెట్ కూర్పు ఉంటుందని, క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే వారికి ఈ సారి అవకాశం కల్పించాలని కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. దీనికోసం ఆయన మంత్రుల పనితీరుపై వేర్వేరుగా నివేదికలను సైతం తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా కేబినెట్లో మార్పులు, చేర్పులు ఉంటాయని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.