రైతుల ఖాతాల్లో పెండింగ్ నిధులు, ఆర్టీసీ పై కేబినెట్ కీలక నిర్ణయం..!!
రైతులకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్. రైతులకు చెల్లించాల్సిన పరిహారం పైన ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్దమైంది. పలు ప్రధాన అంశాలు అజెండాగా తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో కాళేశ్వరం రిపోర్ట్ పైన హైకోర్టు ఇచ్చిన తీర్పు.. అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవికి ఆమోదం తో పాటుగా ఆర్టీసీ సమ్మె... పెండింగ్ లో ఉన్న హామీల అమలు పైన కేబినెట్ లో చర్చించనున్నారు. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు.. గ్రేటర్ పోరు పైనా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ మంత్రివర్గ భేటీ ఈ రోజు జరగనుంది. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె, కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఆర్టీసీ సమ్మె, హైకోర్టు తీర్పుతోపాటు మెట్రో రైలు ప్రాజెక్టు స్వాధీనం, జడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ, ఇందిరమ్మ కుటుంబ బీమా విధి విధానాల ఖరారు తదితర అంశాలపై ఈ భేటీలో నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తున్న 32 సమస్యలపై మంత్రివర్గం చర్చించనుంది. అన్ని అంశాలను పరిశీలించి సమ్మె పరిష్కారానికి నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై కూడా మంత్రివర్గం చర్చిస్తుందని అంటున్నారు. అదే సమయంలో ఇతర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారా నికి ఉన్న అవకాశాలు, పీఆర్సీ నివేదికలు, పెండింగ్ డీఏలు, ఫిట్మెంట్ ప్రకటించాలంటూ చేస్తున్న ఉద్యోగ సంఘాల డిమాండ్లపైనా నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది.

రైతుల ఖాతాల్లో నిధులు... ప్రతీ ఇంటికి భీమా
కాగా, ఏప్రిల్ 30వ తేదీలోగా హైదరాబాద్లోని మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి చెల్లించాల్సిన బకాయిలు, ఇతరత్రా రుణాల కోసం రూ.13వేల కోట్లను రుణంగా తీసుకోనున్నారు. ఈ రుణం ఇచ్చేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. రుణ సేకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత రుణాన్ని తీసుకుంటారు. మరోపక్క, రాష్ట్రంలోని కోటి 15లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. జూన్ 2 నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్లో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై కూడా మంత్రిమండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కోదండరాం, అజారుద్దీన్ను గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా ప్రతిపాదించగా.. దానిపై గవర్నర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులకు చెల్లించాల్సిన పరిహారం, ధాన్యంసేకరణతోపాటు ప్రభుత్వం విడుదల చేసిన కుల సర్వే (సీపెక్)కి సంబంధించిన అంశాలపైనా చర్చించనున్నారు.













Click it and Unblock the Notifications