Telangana Cabinet Meeting: అందరి చూపు వాటి పైనే-లాక్డౌన్ ఎత్తేస్తారా,పీఆర్సీ అమలు ప్రకటిస్తారా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం(జూన్ 7) రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. లాక్డౌన్ ఎత్తివేత లేదా పొడగింపు,ఉద్యోగులకు పీర్సీ అమలుపై కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. పీఆర్సీ బకాయిల చెల్లింపు,రాష్ట్ర ఆర్థిక స్థితి గతులు,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు,కల్తీ విత్తనాలకు అడ్డుకట్ట తదితర అంశాలు కూడా చర్చకు రానున్నాయి. తాజా కేబినెట్ భేటీలో తీసుకోబోయే నిర్ణయాలకు సంబంధించి.. ఆ వెంటనే ప్రభుత్వ జీవోలు జారీ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ కేబినెట్ భేటీ జరగనుంది.
Recommended Video

లాక్డౌన్ ఎత్తేస్తారా?
ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఈ నెల 9తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ను పొడగిస్తుందా లేక ఎత్తివేస్తుందా అన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం,పాజిటివిటీ రేటు 2 శాతానికి పడిపోవడంతో ప్రభుత్వం అన్లాక్ వైపే మొగ్గుచూపవచ్చు. అదే సమయంలో థర్డ్ వేవ్ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే పూర్తి అన్లాక్ చేయకపోవచ్చు. ఇప్పుడున్న లాక్డౌన్ సడలింపులను మరింత పెంచుతూ రాత్రిపూట కర్ఫ్యూని మాత్రం అమలుచేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉన్న సడలింపును సాయంత్రం 5గంటలకు వరకు పెంచే అవకాశం ఉంది.

పీఆర్సీపై నిర్ణయం...
ఉద్యోగులకు పీఆర్సీ అమలుపై తాజా కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలుచేయాల్సి ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంతో ప్రభుత్వం పీఆర్సీని వాయిదా వేసింది. ప్రస్తుతం సెకండ్ వేవ్ దాదాపుగా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం పీఆర్సీ అమలుపై ప్రకటనకు సిద్దమైంది. పెరిగిన జీతాలను జులై నెల నుంచి అమలుచేసే అవకాశం ఉంది.

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాలపై...
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు సంబంధించిన పాస్ మార్కులపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. విద్యార్థులందరినీ పాస్ చేసేలా ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికే ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో సాధించిన మార్కులకు సమానంగా ద్వితీయ సంవత్సరానికి కూడా మార్కులు ఇవ్వాలని బోర్డు ప్రతిపాదించింది. దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేటి కేబినెట్ భేటీలో ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు ఉంచనున్నారు. కేబినెట్ దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం,అడ్మిషన్లు,ఆన్లైన్ క్లాసుల నిర్వహణ అంశాలపై కూడా కేబినెట్ తాజా భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

రైతు బంధు,ధరణి,మూడో వేవ్....
వానా కాలం సాగు నేపథ్యంలో రైతులకు కల్తీ విత్తనాలు, రసాయన మందులు విక్రయించే వారిపై పీడీ యాక్టులు ప్రయోగించేలా ప్రభుత్వం అత్యవసర ఆర్డినెన్స్ తీసుకురానుంది. ఈ ఆర్డినెన్స్కు కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. రైతు బంధు సాయం, ధరణి ఫిర్యాదుల పరిష్కారం, వానా కాలం సాగు, ఎరువులు, విత్తనాలు, రసాయన మందులను అందుబాటులో ఉంచడం, సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, కరోనా మూడో వేవ్కు సన్నద్దమవడం తదితర అంశాలు కూడా కేబినెట్లో చర్చకు రానున్నాయి.












Click it and Unblock the Notifications