అగస్టు 1న తెలంగాణ కేబినెట్ భేటీ... దళిత బంధు,ఇతర కీలక అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం...
తెలంగాణ మంత్రివర్గం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం(అగస్టు 1) సమావేశం కానుంది. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. దళిత బంధు పథకం విధి విధానాలు,అమలు,చేనేత కార్మికులకు భీమా సదుపాయం,తదితర అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు.
దళిత బంధు పథకం అమలుపై ఎన్నో అనుమానాలు,సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో... పకడ్బందీగా దీన్ని అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా అటు హుజురాబాద్ ఉపఎన్నిక గెలుపుతో పాటు భవిష్యత్తులో తెలంగాణవ్యాప్తంగా దళిత వర్గాల్లో బలమైన పట్టు సాధించే యోచనలో ఉంది.
మొదట దళిత సాధికారత పథకంగా ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత దీన్ని దళిత బంధుగా మార్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా అన్ని పార్టీల నేతలను పిలిచి ఈ పథకంపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు.హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలుచేయబోతున్నారు. అయితే ఇదంతా ఎన్నికల స్టంటే అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కేసీఆర్ ఇప్పటికే ఆ విమర్శలను కొట్టిపారేశారు. తమదేమీ సన్నాసుల మఠం కాదని.. మంచి చేసి రాజకీయ లబ్ది కోరుకోవడంలో తప్పేముందని కౌంటర్ ఇచ్చారు.
హుజురాబాద్లో 50వేల పైచిలుకు దళిత ఓట్లు ఉండొచ్చునన్న అంచనా ఉంది. ఇప్పటికే అధికారులు ఎస్సీ కాలనీల్లో తిరుగుతూ వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.కుటుంబానికి రూ.10లక్షలు చొప్పున రూ.2వేల కోట్లు ఒక్క హుజురాబాద్ నియోజకవర్గంలోనే ఖర్చు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
మరోవైపు దళిత సంఘాలు ఈ పథకం అమలుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఈ పథకాన్ని అమలుచేయాలని ఇప్పటికే మహాజన సోషలిస్ట్ పార్టీ అధినేత మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జీహెచ్ఎంసీలో వరద సాయం లాగే ఈ పథకం కూడా మారుతుందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ఇంటికి రూ.10వేలు పంపిణీ చేసిన ప్రభుత్వం... ఎన్నికల తర్వాత దాన్ని అటకెక్కించిందన్నారు. కాబట్టి ఉపఎన్నికకు ముందే ఈ పథకం అమలుచేయాలని డిమాండ్ చేశారు.