కరోనాతో లక్ష కోట్ల నష్టం, పాఠశాలల నిర్వహణపై త్వరలోనే నిర్ణయం: కేసీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండటంతో మహమ్మారిని పూర్తిస్థాయిలో అదుపులో ఉంచేందుకు వైద్యశాఖ ప్రయత్నాలు చేస్తోందన్నారు.
ఏం జరుగుతోంది?: వైఎస్ జగన్, కేసీఆర్ పనితీరుపై నరేంద్ర మోడీ అసహనం: వేస్ట్ ఎందుకంటూ
కరోనాతో లక్ష కోట్ల నష్టం.. పాఠశాలల నిర్వహణపై త్వరలో..
కరోనా కారణంగా తెలంగాణకు రూ లక్ష కోట్ల నష్టం జరిగిందని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారినపడితున్నట్లు తన దృష్టికి వచ్చిందని, దీనిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు సీఎం తెలిపారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం సూచనలు చేస్తోందని తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలు, హాస్టళ్లు నడపాలా? వద్దా? అనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
పాతబస్తీపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్న కేసీఆర్
పాతబస్తీ ప్రజలకు ఇళ్ల కేటాయింపు, మైనార్టీ పాఠశాలల సమస్యలు, వెంటిలేటర్ల సంఖ్య పెంపు లాంటి విషయాలపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఎంఐఎం ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు కేసీఆర్ ఈ మేరకు సమాధానం చెప్పారు. నూతన సచివాలయ నిర్మాణంలో భాగంగా అప్పటికే ఉన్న ఆలయాలు తొలగించాల్సి వచ్చిందని, ఏ మతానికి చెందినవైనా సరే వాటిని అవే స్థలంలో పునర్నిర్మిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
పెట్రోల్, డీజిల్పై పన్నులు కొత్తేమీ కాదన్న కేసీఆర్
అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వలేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు కేసీఆర్ సమాధానమిస్తూ రాష్ట్రంలో గణనీయంగా రేషన్ కార్డుల సంఖ్యను పెంచామన్నారు. 2014కు ముందు రాష్ట్రంలో కేవలం 14 లక్షల రేషన్ కార్డులు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం 39 లక్షలకుపైగా కార్డులున్నాయన్నారు. అర్హులందరికీ పింఛను కూడా ఇచ్చామన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఏ ఒక్కరు కూడా నష్టపోకుండా పరిహారం అందజేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక తమ ప్రభుత్వం కొత్తగా ఏమీ పెట్రోల్, డీజిల్ పై పన్నులు వసూలు చేయడం లేదని, గతంలో కాంగ్రెస్ కూడా వసూలు చేసిందని దాన్నే తాము కొనసాగిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. అయితే, కాస్త పన్నులు కాస్త పెంచామని చెప్పారు.