సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర ఆదేశాలు జారీ
సముద్రంలో ఏర్పడిన 'మొంథా' తుపాను ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. తుపాను తీవ్రత, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలతో పాటు హైదరాబాద్తో సహా ఇతర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆయన అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
రైతులు, ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత
ఈ సమయం వరి కోతలు జరుగుతున్నందున, కళ్లాల్లో ఆరబోసిన ధాన్యానికి ఎటువంటి నష్టం కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ వర్షం నుంచి పంటను కాపాడేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

తుపాను కారణంగా మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, గుండ్రాతిమడుగు స్టేషన్ల వద్ద రైళ్లు నిలిచిపోవడం, కొన్ని రైళ్లను దారి మళ్లించిన నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం రైల్వే అధికారులను ఆదేశించారు.
జిల్లా యంత్రాంగానికి కీలక సూచనలు:
వర్షాలు అధికంగా ఉన్న జిల్లాల్లో సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్ (SDRF) మరియు ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు సమన్వయంతో పనిచేయాలని, జిల్లా కలెక్టర్లు వీరికి మార్గదర్శకత్వం వహించాలని సీఎం ఆదేశించారు.
జల వనరులు: వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించే ప్రమాదం ఉన్నందున, లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సహాయక శిబిరాలకు తరలించాలి. నీటి పారుదల శాఖ అధికారులు నిరంతరం రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాలను పర్యవేక్షించాలి. పూర్తిగా నిండిన జలాశయాల వద్ద ముందుగానే ఇసుక బస్తాలను సిద్ధం చేసుకోవాలి.
రవాణా: లోలెవల్ బ్రిడ్జిలు, కాజ్వేలు, రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిషేధించాలని, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.
వైద్యం, పారిశుద్ధ్యం: నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు పెరిగి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, నగర, పురపాలక, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టాలి. వైద్యారోగ్య శాఖ తగినంత మందులు అందుబాటులో ఉంచి, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
అన్ని ప్రభుత్వ శాఖలు - రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, పోలీస్, అగ్నిమాపక దళాలు - పూర్తి సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు GHMC, హైడ్రా, SDRF సిబ్బంది తక్షణమే స్పందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.












Click it and Unblock the Notifications