Telangana strict lockdown: బేఫికర్: హైదరాబాద్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీకి పర్మిషన్
హైదరాబాద్: తెలంగాణలో ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి 10 రోజుల కఠిన లాక్డౌన్ శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల రోజువారీ సంఖ్యను మరింత నియంత్రించేలా రాష్ట్రవ్యాప్తంగా ఈ 10 రోజుల పాటు లాక్డౌన్ కొనసాగనుంది. రోడ్ల మీదికి వచ్చిన వారెవ్వర్నీ పోలీసులు ఉపేక్షించట్లేదు. వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. కేసులు నమోదు చేస్తోన్నారు. జరిమానాలను విధిస్తోన్నారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సిబ్బందిని కూడా వదలట్లేదు. వారిపైనా లాఠీలను ఝుళిపిస్తున్నారు. వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు.
పోలీసులు తీరుపై విమర్శలు
ఇదివరకు అమలు చేసిన లాక్డౌన్లో ఈ పరిస్థితి తలెత్తలేదు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీకి అనుమతులు ఉండేవి. కఠిన లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తరువాత దీన్ని పోలీసులు అడ్డుకోవడం ప్రారంభించారు. పోలీసుల వైఖరి పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ.. దీనిపై స్పందించారు.
ఆన్లైన్ ఫుడ్ డెలివరీని అడ్డుకోవడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మానవ హక్కుల ఉల్లంఘనగా ఆయన అభివర్ణించారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీని ఎందుకు మినహాయిస్తూ ఉత్తర్వులను జారీ చేశారంటూ మండిపడ్డారు.
మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు..
పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ ప్రముఖ న్యాయవాది కారం కొమిరెడ్డి మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటీషన్ దాఖలు చేశారు. జొమాటో, స్విగ్గి, ఉబేర్ ఈట్స్, డుంజో వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీని లాక్డౌన్ నుంచి మినహాయించిన తరువాత కూడా పోలీసులు ఆయా సంస్థలకు చెందిన సిబ్బందిని అడ్డుకుంటోన్నారని, లాఠీఛార్జీ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 102 ఉల్లంఘనగా పేర్కొన్నారు.

స్పందించిన డీజీపీ
కఠిన లాక్డౌన్ నుంచి ఆన్లైన్ ఫుడ్ డెలివరీని మినహాయించాలంటూ అందిన విజ్ఞప్తులు, చెలరేగిన విమర్శలపై తెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎం మహేందర్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో సమావేశమయ్యారు. కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సహా కఠిన లాక్డౌన్ సమయంలో అత్యవసర సేవలకు మినహాయింపు ఇవ్వాలని సూచించారు. ఆయా సర్వీసులన్నీ సజావుగా సాగేలా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సిబ్బంది తమ గుర్తింపు కార్డులను చూపించితే.. వారిని వెళ్లనివ్వాలని అన్నారు.
Recommended Video

కేసులు తగ్గుముఖం
శనివారం ఆరోగ్యశాఖ అధికారులు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,308 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 21 మంది మరణించారు. 4,723 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,51,035కు చేరుకుంది. ఇందులో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 5,04,970 మంది ఉన్నారు. 3,106 మంది మృత్యువాత పడ్డారు. తాజా బులెటిన్ ప్రకారం.. 42,959 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి.












Click it and Unblock the Notifications