కేంద్ర అవార్డుల్లో తెలంగాణ హవా.. టోటల్ క్లీన్ స్వీప్!!
జాతీయ జల పురస్కారాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించిన 'జల్ సంచయ్ - జన్ భాగీదారి' (జల సంరక్షణ- ప్రజల భాగస్వామ్యం) విభాగంలో దేశంలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. 2024లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ జాతీయ కార్యక్రమంలో భాగంగా 5,20,362 జల సంరక్షణ పనులను పూర్తి చేసి తెలంగాణ నంబర్ వన్ ర్యాంకు సాధించింది.
దేశ రాజధానిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల తెలంగాణకు చెందిన వివిధ జిల్లాల కలెక్టర్లు ఈ పురస్కారాలను అందుకున్నారు. తెలంగాణతో పాటు జల సంరక్షణ- ప్రజల భాగస్వామ్యంలో అత్యుత్తమ పనితీరును కనపర్చిన రాష్ట్రాలు, జిల్లాలకు అవార్డులను ప్రదానం చేశారు. వివిధ విభాగాల్లో మొత్తం 100 అవార్డులను ప్రకటించారు. ఇందులో మూడు రాష్ట్రాలు, జిల్లాలు- 67, మున్సిపల్ కార్పొరేషన్లు- 6, పట్టణ స్థానిక సంస్థ- 1, భాగస్వామ్య మంత్రిత్వ శాఖలు/విభాగాలు- 2, పరిశ్రమలు- 2, ఎన్జీఓ-2 ఉన్నాయి. ఇద్దరు దాతలు, 14 నోడల్ అధికారులు అవార్డులను అందుకున్న వారిలో ఉన్నారు.

జల సంరక్షణలో వ్యక్తులు, కమ్యూనిటీలు, కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రాలను అయిదు జోన్లుగా విభజించింది. ప్రతి జోన్ కనీసం 10,000 కృత్రిమ రీఛార్జ్, నిల్వ నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంటి పైకప్పుల వర్షపు నీటి నిల్వ చేయడం, చెరువులు, కుంటలు, బావుల పునరుజ్జీవనం వంటివి ఇందులో ఉన్నాయి. పనితీరు ఆధారంగా మూడు కేటగిరీల్లో అవార్డులు అందజేశారు.
కేటగిరీ 1లో రెండు కోట్ల రూపాయలు, కేటగిరీ 2లో కోటి, కేటగిరీ 3 కింద 25 లక్షల రూపాయలు నగదు బహుమతిని కేంద్రం ప్రకటించింది. దక్షిణ జోన్ పరిధిలోని జిల్లా విభాగంలో (కేటగిరీ 1) తెలంగాణకు చెందిన మూడు జిల్లాలు అగ్రస్థానంలో నిలిచాయి. మొత్తం ఆరు కోట్ల రూపాయల బహుమతిని పొందాయి. ఇందులో అదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల మూడవ ర్యాంకు సాధించి, జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచాయి.
మున్సిపల్ కార్పొరేషన్ల విభాగంలో హైదరాబాద్ వాటర్ వర్క్స్, రెండో స్థానంలో నిలిచి, రెండు కోట్ల రూపాయల రివార్డును అందుకుంది. కేటగిరీ 2లో దక్షిణ జోన్ నుండి వరంగల్, నిర్మల్, జనగాం జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఒక్కో జిల్లా కోటి రూపాయల చొప్పున నగదు బహుమతిని గెలుచుకున్నాయి.
కేటగిరీ 3లో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్ జిల్లాలు ఒక్కొక్కటి 25 లక్షలు రూపాయలు చొప్పున నగదు ప్రోత్సాహక బహుమతిని అందుకున్నాయి. ఢిల్లీలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి ఆయా జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. పురస్కారాలను అందుకున్నారు.
దీంతో పాటు సెంట్రల్ వాటర్ కమిషన్ నుండి ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి నోడల్ అధికారిగా ఉన్న ఎ సతీష్.. జాతీయ అవార్డును అందుకున్నారు.












Click it and Unblock the Notifications