వాహనదారులకు అలెర్ట్.. ఈ కోర్సు పాసైతేనే డ్రైవింగ్ లైసెన్స్!
తెలంగాణా రాష్ట్రంలో వాహన వినియోగం బాగా పెరిగిపోయింది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకుని వాహనాలు నడపాలి. కానీ ఆ పరిస్థితి లేదు. ట్రాఫిక్ నిబంధనలు తుంగలో తొక్కి వాహనాలు నడుపుతున్న పలువురు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. దీంతో ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఇక మైనర్ లు వాహనాలు నడుపుతున్న పరిస్థితి కూడా ఉంది.
డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో ముఖ్యమైన మార్పులు
ఈ క్రమంలో తెలంగాణా ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో ముఖ్యమైన మార్పులను తీసుకువస్తుంది. ఇకపై లెర్నర్ లైసెన్స్ పొందిన అభ్యర్థిరోడ్ సేఫ్టీ కోర్సు పూర్తి చేసిన తర్వాతే శాశ్వత లైసెన్స్ పరీక్షకు అనుమతి లభిస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే తప్పనిసరిగా ఈ కోర్సు పూర్తి చెయ్యాలి, రవాణా శాఖ ఈ నిబంధనను సుప్రీం కోర్టు రోడ్ సేఫ్టీ కమిటీ ఆదేశాల మేరకు అమలు చేస్తుంది.

రోడ్ భద్రతకు సంబంధించి 120 వీడియోలు
ఈ కోర్సులో రోడ్ భద్రతకు సంబంధించిన 64 నిబంధనలు, 120 వీడియోలు ఉంటాయి. లైసెన్స్ కోసం వాహనదారులు తప్పక వీటిని గురించి తెలుసుకోవాలి. ఈ కోర్సులో ఆరు మాడ్యూళ్లు ఉంటాయి. ప్రతి మాడ్యూల్ సుమారు 25 నిమిషాలు. మొత్తం కోర్సు రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు ఉంటుంది. ప్రతి మాడ్యూల్ తర్వాత క్విజ్ ఉంటుంది. చివరలో మరోసారి పరీక్ష రాస్తే కోర్సు పూర్తవుతుంది.
ఇంటి నుంచే ఈ కోర్సును పూర్తి చేసేలా అవకాశం
తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఉచితంగా ఈ కోర్సు అందుబాటులో ఉంది. కెమెరా ఉన్న మొబైల్, ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా ఇంటి నుంచే ఈ కోర్సును పూర్తి చేయవచ్చు. ప్రారంభంలో ఫేస్ రిజిస్ట్రేషన్ అవసరం. మధ్యలో ఆపి తర్వాత కొనసాగించవచ్చు. వీడియోల్లో వాహనం స్టార్ట్ చేయడం, హ్యాండ్ బ్రేక్, మిర్రర్లు సెట్ చేయడం, సీట్ బెల్ట్, లైట్ల వినియోగం, పిల్లలు-మహిళల భద్రత వంటి అంశాలు ఉన్నాయి.
త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా రహదారి భద్రత కోర్సు
వీడియోలను చూసి, జాగ్రత్తగా చూసి అర్ధం చేసుకుని వాటిపై ఇచ్చిన క్విజ్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. దీనిని ప్రస్తుతం కూకట్పల్లి ఆర్టీవో పరిధిలో పైలట్గా అమలు చేశారు. 1,070 మంది నమోదు కాగా 890 మంది పూర్తి చేశారు. రవాణా కమిషనర్ ఇలంబర్తి వివిధ దేశాల కోర్సులను అధ్యయనం చేసి దీన్ని రూపొందించారు. ఈ కోర్సు కోసం యునిసెఫ్ 60 శాతం నిధులు అందించింది. రోడ్డు ప్రమాదాల్లో మానవ తప్పిదాలు తగ్గించి, కొత్త డ్రైవర్లలో అవగాహన పెంచడమే లక్ష్యంగా దీనిని తీసుకొచ్చారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు.












Click it and Unblock the Notifications