తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి కారణం చెప్పిన ఉత్తమ్..!!
uttam kumar reddy: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముమ్మరంగా కొనసాగుతోంది. సరిగ్గా ఈ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అదే దూకుడును ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కొనసాగించింది హస్తం పార్టీ. తొలి గంటలోనే పూర్తిస్థాయి మెజారిటీని సాధించింది.
తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్.. 60. ఈ మార్క్ను అలవోకగా అందుకుంది కాంగ్రెస్. తొలి రౌండ్ నుంచే ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చింది. ఎక్కడే గానీ వెనుకంజ వేసినట్లు కనిపించలేదు. పోస్టల్ బ్యాలెట్లలో సాధించిన పైచేయిని ఈవీఎం లెక్కింపుల్లోనూ కంటిన్యూ చేసింది.

ఆ తరువాత ఆధిక్యత చేతులు మారుతూ వచ్చింది. 66 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యత సాధించింది. 41 నియోజకవర్గాల్లో భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థులు పైచేయి సాధించారు. అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్.. మూడు సీట్లకే పరిమితమైంది. బీజేపీ తొమ్మిది చోట్ల లీడింగ్లో ఉంది.
దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. గాంధీ కుటుంబానికి తెలంగాణ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని, అది ఇప్పుడు మరోసారి నిరూపితమైందని అన్నారు. కాంగ్రెస్ కష్టాల్లో చిక్కుకున్న ప్రతీసారి తెలుగు ప్రజలు ఆదుకున్నారని వ్యాఖ్యానించారు.
2014, 2018 ఎన్నికల్లో తాము కొన్ని తప్పులు చేశామని, ఈ సారి అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డామని ఉత్తమ్ పేర్కొన్నారు. నాటి ఈ రెండు ఎన్నికల్లో చేసిన తప్పులను సకాలంలో సరి చేసుకోవడం వల్లే ప్రజలు తమను ఆదరిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉందని, దాన్ని తాము ఓట్లుగా మలచుకోగలిగామనీ ఉత్తమ్ అన్నారు. అహంకారపూరిత,అవినీతిమయమైన కేసీఆర్ పాలనను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టారని, కుటుంబ పాలనకు చరమగీతం పాడారని చెప్పారు.












Click it and Unblock the Notifications