Telangana లో పేదలందరికీ 15 కిలోల ఉచిత బియ్యం... 2 కోట్ల పైచిలుకు మందికి లబ్ది...
కరోనా సంక్షోభంలో పేదలు ఆకలితో అలమటించవద్దన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నెలలో బీపీఎల్ కార్డుదారులకు 15 కిలోల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటన చేశారు.
జూన్ నెల రేషన్లో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 53లక్షల 56వేల కార్డులకు అందించే పదిహేను కిలోలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం 33లక్షల 86వేల కార్డుదారులకు ఎలాంటి పరిమితి లేకుండా 15 కిలోలు ఉచితంగా అందించనుంది. అంత్యోదయ అన్నయోజన కార్డుదారులకు 35 కేజీలకు అదనంగా మరో 10 కిలోల్ని, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోలకు అదనంగా మరో 10 కిలోల బియ్యం అందించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 2,79,24,300 మందికి లబ్ది చేకూరనుంది.
రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించి ఆదివారం(మే 31) ఉత్తర్వులు వెలువడ్డాయి. పౌర సరఫరా శాఖ అధికారులు బియ్యం పంపిణీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలోని మొత్తం 87,42,590 కార్డులకు 4 లక్షల 31 వేల మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యం సరఫరా చేయనున్నారు.
రెండు రోజుల క్రితం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉచిత బియ్యం పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న 5 కిలోల ఉచిత బియ్యం కార్యక్రమాన్ని తెలంగాణలో చేపట్టాలని ముఖ్యమంత్రికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. దేశంలోని 80 కోట్ల మందికి లబ్ది చేకూరేలా కేంద్రం గరీబ్ కల్యాణ్ అన్న యోజనా పథకం కింద ఉచిత ఆహార పదార్థాలు పంపిణీ చేస్తోందన్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మే,జూన్ మాసాలకు కేంద్రం ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో దీని అమలులో జరుగుతున్న జాప్యాన్ని అరికట్టాలని సూచించారు.