రేవంత్ సరికొత్త ప్లాన్: సొంత నియోజకవర్గం కేంద్రంగా..!!
Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పాలనపై తనదైన ముద్ర వేస్తోన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. తనదైన ఓ ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేసుకున్నారు.
శాంతి భద్రతలు, ప్రజా సమస్యల పరిష్కారం, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల కల్పన, ఎన్నికల ప్రచార సమయంలో ప్రకటించిన ఆరు ఉచిత గ్యారంటీల అమలు.. వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో చోటు చేసుకున్నట్లుగా భావిస్తోన్న తప్పులను సరిదిద్దుతున్నారు.

ఈ క్రమంలో మరో ముందడుగు వేశారు రేవంత్ రెడ్డి. తన సొంత నియోజకవర్గం కొడంగల్ కేంద్రంగా సరికొత్త ప్రణాళికను రూపొందించారు. నారాయణ్పేట్, వికారాబాద్ జిల్లాలను జాయింట్గా సమగ్రంగా అభివృద్ధి చేయడంపై కసరత్తు మొదలు పెట్టారు. ఈ రెండు జిల్లాల రూపురేఖలను మార్చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు.
దీనికోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని సృష్టించారు. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (KADA) పేరుతో ఇది ఏర్పాటైంది. వికారాబాద్ జిల్లా కేంద్రంగా ఈ అథారిటీ తన కార్యకలాపాలను చేపడుతుంది. వికారాబాద్ జిల్లా కలెక్టర్.. దీనికి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. అలాగే- కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి స్పెషల్ ఆఫీసర్ను సైతం అపాయింట్ చేశారు.

కొడంగల్ ప్రాంతీయ అభివృద్ధి మండలి పరిధిలోకి వచ్చే అన్ని పట్టణాలు, గ్రామాల్లో.. కనీస మౌలిక సదుపాయాలను కల్పించడం, సీసీ రోడ్ల నిర్మణాలను చేపట్టడం, సీసీ డ్రైనేజీ అభివృద్ధి, మంచినీటి సరఫరా, అన్ని గ్రామాలనూ విద్యుదీకరించడం, వీధి దీపాల నిర్వహణ.. వంటి పనులను ఈ అథారిటీ పర్యవేక్షిస్తుంది.
ఈ అథారిటీ పరిధిలో ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, ప్రజలకు మరింత మెరుగైన విద్య, వైద్యాన్ని అందించడం.. వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది. భూగర్భ జల సంరక్షణ, భూసార పరిరక్షణ, సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడం, వ్యవసాయోత్పత్తులను రెట్టింపు చేయడం వంటి కార్యక్రమాలను ఈ అథారిటీ పర్యవేక్షిస్తుంది.












Click it and Unblock the Notifications