ఉద్యోగులకు ప్రభుత్వం న్యూ ఇయర్ కానుక - బకాయిలు విడుదల..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు న్యూ ఇయర్ కానుక ప్రకటించింది. ఉద్యోగులకు చెల్లించాల్సి బకాయిలను వరుసగా విడుదల చేస్తున్న ప్రభుత్వం ఈ రోజు మరో విడత నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులతో చర్చల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ బకాయిలను విడుదల చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న బకాయిల పైనా స్పష్టత ఇచ్చారు.
ఉద్యోగుల పెండింగ్ బిల్లుల బకాయిల్లో ఈ నెల కూడా రూ.713 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. రెగ్యులర్, రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్స్, అడ్వాన్స్ బిల్లులు వేలాది కోట్లలో పెండింగ్లో ఉన్నాయి. దీంతో విడతలవారీగా బకాయిలను చెల్లిస్తామని ఉద్యోగులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.

నవంబర్ నెల బకాయిలను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీచేశారు. కొత్త సంవత్సరం కానుకగా ఈ రోజునే విడుదల చేసేందుకు వీలుగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల పైన చర్చలు చేసింది. అదే సమయంలో విడతల వారీగా బకాయిలను క్లియర్ చేస్తామని హామీ ఇచ్చింది.
ఉద్యోగ సంఘాలతో చర్చల వేళ ప్రభుత్వం ఒక డీఏ ప్రకటించగా.. పెండింగ్ బిల్లులు నెల చొప్పున విడుదల చేస్తామని నచ్చ చెప్పింది. గత నాలుగు నెలలుగా విడతలవారీగా ప్రభుత్వం క్లియర్ చేస్తున్న ఈ బిల్లులలో గ్రాట్యుటీ, GPF, సరెండర్ లీవ్ మరియు వివిధ అడ్వాన్స్లు ఉన్నాయి. అదే విధంగా ఈ నెల బకాయిల పైన ఉత్తర్వులు జారీ చేసారు. మిగిలిన బకాయిల ను ఇదే తరహాలో పూర్తిగా చెల్లింపులు చేస్తామని అధికారులు వెల్లడించారు. అయితే, డీఏల పెండింగ్ అంశం పైన మరోసారి ప్రభుత్వంతో చర్చల దిశగా ఉద్యోగ సంఘాల నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాల వేళ.. ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications