పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులు ఉండేనా - బిగ్ టర్న్..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన ఎమ్మెల్యే అంశం పై హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికే ఈ కేసులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఈ పిటీషన్ దాఖలు చేసింది. ఈ తీర్పు వేళ రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.
హైకోర్టు తీర్పు
ఎమ్మెల్యేల అనర్హత అంశం పైన ఈ రోజు (సోమవారం) హై కోర్టు తీర్పు వెలువరించనున్నది. ఇరుపక్షాల వాదనలు గత నెల 7వ తేదీన పూర్తయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గత ఏప్రిల్ 24న దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు లోతుగా విచారించింది. బీఆర్ఎస్ తరఫున గెలిచి, కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి (స్టేషన్ఘన్పూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం)పై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన దాఖలు చేసారు.

అనర్హత పిటీషన్లు
దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్రెడ్డి మరొకరు పిటిషన్ దాఖలు చేశారు. ఆయా వ్యాజ్యాలపై వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేసింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన చట్టసభ సభ్యులపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్ను శాసనసభ స్పీకర్ విచారణ చేయకుండా కాలయాపన చేస్తుంటే.. ఆ వ్యవహారంపై న్యాయ సమీక్ష చేయొచ్చని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం వాదించారు.
రాజకీయ ఉత్కంఠ
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్పీకర్కు ఫిర్యాదు అందిన మూడు నెలల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మార్చిలో స్పీకర్కు ఫిర్యాదు చేస్తే ఫలితం లేకపోయిందని, మూడు నెలల గరిష్ఠ గడువు ముగిసినందున మరో నాలుగు వారాలు స్పీకర్ సమయం తీసుకునేలా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటీషన్ల పై నేడు హైకోర్టు ఇవ్వనున్న తీర్పు రాజకీయంగా ఉత్కంఠను పెంచుతోంది.












Click it and Unblock the Notifications