షాక్: టి జడ్జిల మూకుమ్మడి రిజైన్: గవర్నర్ వద్దకు నో, ఉద్రిక్తత
హైదరాబాద్: న్యాయశాఖలో ప్రాథమిక కేటాయింపుల పైన తెలంగాణ న్యాయాధికారులు ఆదివారం నాడు నిరసన వ్యక్తం చేశారు. ఆప్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జడ్జిలు అందరూ మూకుమ్మడి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.
తద్వారా, న్యాయశాఖలో కేటాయింపులపై తెలంగాణ న్యాయాధికారులు నిరసన ఉద్ధృతం చేయనున్నారు. రాజీనామాలను న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడికి పంపించారు. అనంతరం గన్పార్క్ నుంచి రాజ్భవన్కు ర్యాలీగా వెళ్లి గవర్నర్ నరసింహన్ను కలవాలని నిర్ణయించారు.
దాదాపు వందమంది జడ్జిలు రాజీనామా చేశారు. ఇలా ఇంతమంది జడ్జిలు రాజీనామా చేయడం ఇదే తొలిసారి అంటున్నారు. కాగా, గవర్నర్ నరసింహన్ను కలిసేందుకు వారికి అనుమతి లేదని, కాబట్టి అడ్డుకుంటామని పోలీసులు చెప్పారు. ఖైరతాబాద్ జంక్షన్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ప్రాజెక్టులు కట్టడం నాగంకు ఇష్టంలేదా: ఎంపీ జితేందర్ రెడ్డి
గతంలో మంత్రిగా పని చేసిన నాగం జనార్థన్ రెడ్డి పాలమూరు జిల్లాకు ఏం చేశాడని ఎంపీ జితేందర్ రెడ్డి ఆదివారం ప్రశ్నించారు. జిల్లా రైతులు వలసలు పోతుంటే నాగం మంత్రిగా ఏం చేశారన్నారు. తెరాస ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే అడ్డుకుంటున్నారన్నారు.
రైతులు బాగుపడటం నాగంకు ఇష్టంలేదా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులను అడ్డుకోవడం నాగంకు మంచిది కాదన్నారు. కాగా, పాలమూరు జిల్లాలోని నారాయణపేట్లో నాగం దిష్టిబొమ్మను తెరాస కార్యకర్తలు దగ్ధం చేశారు. వనపర్తిలో టిడిపి నేత రేవంత్ రెడ్డి, నాగం దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రేవంత్ రెడ్డి, నాగం జనార్థన్ రెడ్డి అడ్డుకుంటున్నారని, పాలమూరు జిల్లాలో ఇద్దరు కలుపుమొక్కలుగా మిగిలారని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి వేరుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రాజెక్టును చంద్రబాబు అడ్డుకుంటున్న విషయం రేవంత్, నాగంలకు తెలియదా అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి, నాగంలకు పాలమూరు ప్రజలు దేహశుద్ధి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.