వరంగల్కు విమానాశ్రయం వస్తుంది: కేటీఆర్, తెలంగాణ జలాల కోసం ఏపీతోనే కాదు దేవుడితోనైనా పోరాటం
హైదరాబాద్: వరంగల్కు విమానాశ్రయం అనేది ఎప్పుటినుంచే నానుతూ వస్తున్న అంశం. తాజాగా, ఈ అంశంపై రాష్ట్ర మంత్రి స్పందించారు. వరంగల్ నగరానికి ఖచ్చితంగా విమానాశ్రయం వస్తుందని, దాని కోసమే ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ శనివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఓ నెటిజన్ వరంగల్లో విమానాశ్రయం గురించి కేటీఆర్ను అడిగారు. ఈ ప్రతిపాదన దీర్ఘకాలికంగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్కు అన్యాయం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనైనా న్యాయం చేయాలి. విమానాశ్రయం వల్ల వరంగల్తోపాటు సమీప జిల్లాలు అభివృద్ధి చెందుతాయని సదరు నెటిజన్ కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చాడు.
దీనిపై మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ.. వరంగల్కు విమానాశ్రయం వస్తుందని, ప్రభుత్వం ఇందుకోసం పనిచేస్తోందని తెలిపారు. మరో నెటిజన్ తన కూతురుకు వైద్య సాయం అందించాలని మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారు. తన కూతురు రిషిత వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని, చికిత్సకు భారీ వ్యయం దృష్ట్యా తాము నిస్సహాయంగా ఉన్నామని బాలిక తండ్రి రాజశేఖర్ మంత్రి కేటీఆర్కు తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఇది ఇలావుండగా, శనివారం నారాయణపేటలో పర్యటించిన కేటీఆర్.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏపీతోనే కాదు.. దేవుడితోనైనా కొట్లాడతాం.. చట్టప్రకారం తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను సాధించుకుంటామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాయకత్వంలో.. ఎవరెన్ని రకాలుగా అడ్డుకున్నా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేస్తామని ప్రకటించారు.