కట్టుబట్టలతో రాహుల్ను బయటికి పంపిన మోదీ: ఇంతకింత మూల్యం
న్యూఢిల్లీ/హైదరాబాద్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, అనర్హతకు గురైన లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ.. తన అధికారిక బంగళాను ఖాళీ చేశారు. దేశ రాజధానిలోని నంబర్ 12, తుగ్లక్ లేన్లో గల నివాసం నంచి సామాగ్రిని తరలించారు. శనివారం తన తల్లి సోనియాగాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ఆ బంగళాకు వెళ్లారు. సామాన్లను తరలించిన అనంతరం.. తన చేతులతో తాళం వేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇంటిపేరుతో విమర్శించిన నేపథ్యంలో రాహుల్ గాంధీకి గుజరాత్లోని సూరత్ న్యాయస్థానం రెండు సంవత్సరాల కారాగార శిక్షను విధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను సూరత్ న్యాయస్థానం దోషిగా తేల్చింది. జైలు శిక్ష పడిన నేపథ్యంలో లోక్సభ సెక్రెటేరియట్ ఆయనపై అనర్హత వేటు వేసింది. లోక్సభ సభ్యుడిగా రాహుల్ గాంధీకి కేటాయించిన అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేయాలంటూ ఆదేశించింది లోక్సభ సెక్రెటేరియట్.

ఎంపీ హోదాలో రాహుల్ గాంధీ- నంబర్ 12, తుగ్లక్ లేన్లో తనకు కేటాయించిన అధికారిక బంగళాలో ఉండేవారు. అనర్హత వేటు పడటం వల్ల తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. దీనితో ఈ బంగళాను ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇప్పటివరకు నాలుగుసార్లు లోక్సభకు ఎన్నికైన ఆయన 20 సంవత్సరాలుగా ఇదే బంగళాలో నివసించారు. దీన్ని ఖాళీ చేసిన తరువాత సోనియాగాంధీ ఇంట్లో నివాసం ఉంటోన్నారు.

రాహుల్ గాంధీ తన బంగళాను ఖాళీ చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియో క్లిప్ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. కట్టుబట్టలతో రాహుల్ గాంధీని బయటికి పంపించిందని, దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
గొప్ప కుటుంబ వారసత్వ చరిత్ర ఉండి, దేశానికి తమ వారసత్వ ఆస్తులను ధారబోసిన కుటుంబం నుండి వచ్చిన శ్రీ రాహుల్ గాంధీని బీజేపీ ప్రభుత్వం కక్షగట్టి, పార్లమెంటుకి అనర్హుడిగాచేసి, అధికారనివాసమైన ఇల్లును ఖాళీచేయించి కట్టుబట్టలతో బయటకు పంపించిన సమయంలో చాలా హుందాగా, యువతకు ఆదర్శవంతంగా… pic.twitter.com/uXdNLlsU9q
— Revanth Reddy (@revanth_anumula) April 23, 2023
దేశానికి తమ ఆస్తులను ధారబోసిన గొప్ప కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం కక్షగట్టిందని ఆరోపించారు. ఆయనను అనర్హుడిగా చేయడం ద్వారా లోక్సభలో అడుగు పెట్టనివ్వకుండా చేసిందని మండిపడ్డారు. అధికార నివాసాన్ని ఖాళీ చేయించి, కట్టుబట్టలతో బయటకు పంపించిందంటూ విమర్శించారు. ఆ సమయంలో కూడా రాహుల్ గాంధీ ఎంతో హుందాగా వ్యవహరించారని గుర్తు చేశారు.
బంగళాను ఖాళీ చేసే సమయంలో రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు యువతకు ఆదర్శవంతమని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇంటిని ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పజెప్పి బయటకు వెళ్లిన తీరుతో భారతీయ ఆత్మకు ఆయన మరింత చేరువయ్యారని వ్యాఖ్యానించారు. ఇంటిని ఖాళీ చేస్తోన్న దృశ్యాలను చూసినవాళ్లకు కళ్లల్లో నీటి సుడులు తిరుగుతాయని, గుండెలు బరువెక్కుతాయని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications