తెలంగాణలో జులై 6 నుంచి మార్కెట్లోకి పాఠ్య పుస్తకాలు, ప్రభుత్వ ధరకే అమ్మకాలు
హైదరాబాద్: తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు జులై 6 నుంచి బహిరంగ మార్కెట్లో పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ప్రచురణల సంచాలకులు శ్రీనివాస చారి తెలిపారు. ఈ సంవత్సరం పాఠ్యపుస్తకాల్లో చాప్టర్ల వారీగా క్యూఆర్ కోడ్ ప్రచురించామని వెల్లడించారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ పాఠాన్ని ఆడియో, వీడియో రూపంలో కూడా విద్యార్థులకు అందుబాటులో తెచ్చామని వివరించారు.
జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి అనుమతి పొందిన విక్రయ కేంద్రాల్లో జులై 6వ తేదీ నుంచి పాఠ్య పుస్తకాల అమ్మకాలు ప్రారంభం అవుతాయని శ్రీనివాస చారి తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువ ధర వసూలు చేస్తే డీఈఓలకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఒకటి నుంచి పదో తరగతి వరకు అన్ని సబ్జెక్టుల పాఠ్య పుస్తకాలను విక్రయించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కాగితం ధర, టెండర్లు ఖరారు చేయడంలో జాప్యం కావడంతో పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రావడం ఆలస్యం అవుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ, విక్రయాల కాంట్రాక్టును 13 ప్రైవేటు సంస్థలకు అప్పగించినట్లు శ్రీనివాస చారి తెలిపారు.
ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. వాటికి సంబంధించిన పాఠ్య పుస్తకాల ముద్రణ కూడా పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాగా, ఇప్పటికే తెలంగాణలో పాఠశాలలు ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో పుస్తకాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన రావడంతో విద్యార్థులు పుస్తకాల కొనుగోలుకు సిద్ధమవుతున్నారు.