Telangana strict lockdown: నో ఎక్స్క్యూజ్: ఏపీతో సరిహద్దులు క్లోజ్: వాటికి మాత్రమే అనుమతి
హైదరాబాద్: తెలంగాణలో ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి 10 రోజుల కఠిన లాక్డౌన్ శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల రోజువారీ సంఖ్యను మరింత నియంత్రించేలా రాష్ట్రవ్యాప్తంగా ఈ 10 రోజుల పాటు లాక్డౌన్ కొనసాగనుంది. రోడ్ల మీదికి వచ్చిన వారెవ్వర్నీ పోలీసులు ఉపేక్షించట్లేదు. వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. కేసులు నమోదు చేస్తోన్నారు. జరిమానాలను విధిస్తోన్నారు.
ఏపీ సరిహద్దులను కూడా పోలీసులు మూసివేశారు. కర్నూలు, నల్లగొండ సరిహద్దుల్లో చెక్పోస్టుల వద్ద ప్రత్యేకంగా పోలీసు బలగాలను మోహరింపజేశారు. ఇ-పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే రాకపోకలు సాగించడానికి అనుమతి ఇస్తోన్నారు. ఇ-పాస్ లేనప్పటికీ.. ఉదయం 10 గంటల్లోగా తెలంగాణకు చేరడానికి వీలు ఉండేది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఇ-పాస్ ఉంటేనే అనుమతి ఇస్తోంది. ఇ-పాస్ లేకుండా తెలంగాణకు బయలుదేరిన వాహనాలన్నీ సరిహద్దుల వద్దే నిలిచిపోయాయి.

గతంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల నేపథ్యంలో సరిహద్దుల్లోని చెక్పోస్టుల వద్ద తెలంగాణ ప్రభుత్వం అదనపు పోలీసులను మోహరింపజేసింది. సరిహద్దుల వద్ద పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. అంబులెన్సులు, అత్యవసర వాహనాలకు ఇ-పాస్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ క్రమంలో సూర్యాపేట్ జిల్లా రామాపురం క్రాస్రోడ్డు చెక్పోస్ట్, జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ప్లాజా వద్ద.. ఏపీకి చెందిన వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
జాతీయ రహదారులపై రాకపోకలు సాగించే వాహనాలు, నిత్యావసర సరుకులను తరలించే ట్రక్కులు, లారీలకు అనుమతి ఇస్తోన్నారు. లాక్డౌన్ సడలింపు ఉందని వాహనదారులు భారీగా తరలిరావడంతో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ-పాస్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ-పాస్లు లేని వాహనదారులను నిలిపివేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల వద్ద పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఇ-పాస్ లేని వాహనాలను వెనక్కి పంపించేస్తున్నారు పోలీసులు.












Click it and Unblock the Notifications