YS Sharmila: పోలీసులు అడ్డుకున్నా..అనుకున్న లక్ష్యానికి: రైతులకు అండగా మరో పోరుకు
వికారాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. తాను అనుకున్నది సాధించేంత వరకూ విశ్రమించేది లేదనే విషయాన్ని మరుమారు నిరూపించుకున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేయడానికి పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికీ.. తన ఇంటి వద్దే దాన్ని కొనసాగించారు. తన లక్ష్యాన్ని పూర్తి చేశారు.
Recommended Video
అజ్ఞాతవాసిని..అన్నీ రాత్రిపూటే: పుట్టింటికి దగ్గర్లో: ప్రియుడి గదిలో 11 ఏళ్ల రహస్య జీవితం
ఈ క్రమంలో ఎదురైన అవాంతరాలను ఆమె అధిగమించగలిగారు. తాజాగా- ఆమె తలపెట్టిన వికారాబాద్ జిల్లా పర్యటనను పోలీసులు అడ్డుకున్నప్పటికీ.. వెనుకంజ వేయలేదు. వికారాబాద్ జిల్లాలో అడుగు పెట్టారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పలకరించారు.. పరామర్శించారు. తానున్నాననే భరోసా ఇచ్చారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. వర్షానికి తడిచిన, రంగు మారిన ధన్యాన్ని ప్రభుత్వం కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని నినదించారు.
ఈ ఉదయం ఆమె హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన లోటస్పాండ్ నివాసం నుంచి కారులో పరిగికి బయలుదేరారు. ఆమె వెంట పార్టీ సీనియర్ నేత కొండా రాఘవరెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పార్టీ సన్నాహక కమిటీ నాయకులు ఉన్నారు. మార్గమధ్యలో చేవెళ్లలోని చింతపల్లి వద్ద వైఎస్ షర్మిల కారును పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఇనుప బ్యారికేడ్లను అమర్చారు. ముందుకు సాగడానికి వీల్లేదని చెప్పారు. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
బ్యారికేడ్లను అమర్చడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలు స్తంభించిపోయాయి. కొండా రాఘవరెడ్డి పోలీసులతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ర్యాలీగా తరలి వెళ్లడానికి అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పారు. కొండా రాఘవరెడ్డి వారికి సర్దిచెప్పారు. తాము కోవిడ్ ప్రొటోకాల్స్ను ఉల్లంఘించట్లేదని, పరిమితంగానే వెళ్తోన్నామని స్పష్టం చేశారు. చివరికి పోలీసులు వైఎస్ షర్మిల కాన్వాయ్ వెళ్లడానికి అనుమతి ఇచ్చారు.
పరిగి నియోజకవర్గం పరిధిలోని దోమ మండలం పోలేపల్లి, ఇతర గ్రామాల్లో షర్మిల పర్యటించారు. భారీ వర్షాలకు తడిచి ముద్దయిన వరి కుప్పలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అధికారులు అంగీకరించట్లేదని, కనీస మద్దతును కల్పించకపోతే తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోయారు. ప్రకృతి వైపరీత్యాలను ఎవరూ నివారించలేరని, అలాంటప్పుడు రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని షర్మిల అన్నారు. తడిచిన ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.