కరీం నగర్ లో మూడు కిలోమీటర్ల మేర రెడ్ జోన్ .. రీజన్ ఇదే
కరోనా వైరస్ తెలంగాణా రాష్ట్రంలో పదుల సంఖ్యలో బాధితులను తయారు చేసింది. ఇక వందల సంఖ్యలో అనుమానితులు క్వారంటైన్ లో ఉన్నారు. తెలంగాణా రాష్ట్రం అంతా ఒకలా ఉంటె ఒక్క కరీం నగర్ లో మాత్రం కరోనా ప్రజలను వణికిస్తుంది. కరీంనగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతాన్ని పోలీసులు రెడ్ జోన్ గా ప్రకటించారు. ఈ ప్రాంతానికి మూడుకిలోమీటర్ల వరకూ ఎవరినీ అనుమతించడం లేదు. కరోనా పాజిటివ్ ఉన్న ఇండోనేషియన్లు కరీంనగర్ లో పర్యటించటం ఇక వారి నుండి ఒక వ్యక్తికి తాజాగా కరోనా పాజిటివ్ రావటంతో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు.
కరీం నగర్ లో హెల్త్ ఎమర్జెన్సీ
వివిధ దేశాల నుంచి కరీం నగర్ జిల్లాకు 371 మంది విదేశీ ప్రయాణికులు వచ్చారు. వీరిలో గంగాధర మండలంలో 58 మంది, రామడుగులో 48 మంది, చొప్పదండిలో 39 మంది ఉన్నారు. ఇప్పటికే వీరిలో పలువురికి ఎడమ చేతి మణికట్టుపైన ఇండిబుల్ ఇంక్తో స్టాంపులు వేశారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఇళ్ల నుంచి బయటకు రాకుండా జియో ట్యాగింగ్ కూడా చేయాలని ఆదేశించారు. హెల్త్ ఎమర్జెన్సీ దృష్ట్యా మల్టీ ఏజెన్సీల కంట్రోల్రూం ఏర్పాటు చేశారు అధికారులు.
మూడు కాలనీలు..మూడు కిలోమీటర్ల మేర రెడ్ జోన్
ఇక ఇండోనేషియన్ ల వల్ల తాజాగా కరీం నగర్ లో కరోనా కేసు నమోదైన ఇంటికి సమీపంలోనే 80 మంది కరోనా అనుమానిత లక్షణాలున్న వ్యక్తులను గుర్తించి వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్సఅందిస్తున్నారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని.. ఏమైనా కావాలంటే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి చెప్పాలని , ఎవరూ బయటకు రావద్దని చెప్తున్నారు. టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి చెబితే తామే స్వయంగా తీసుకొస్తామని పోలీసులు చెబుతున్నారు. కాదని బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.
ఇంటింటికీ తిరిగి నిత్యవసరాలు అందిస్తున్న కరీంనగర్ మున్సిపల్ అధికారులు
ముఖరాంపురా, భగత్ నగర్, కశ్మీర్ గడ్డ..ప్రాంతాలను పోలీసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఇండోనేషియా వాసులు ఈ ప్రాంతంలోనే తిరగడంతో ఇక్కడ వారి మీద కరోనా ప్రభావం ఉంటుందని భావించి ఇతరులకు కరోనా వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక నిన్న సాయంత్రం నుంచి ఇంటింటికీ తిరిగి నిత్యవసరాలు అందిస్తున్నారు కరీంనగర్ మున్సిపల్ అధికారులు.
ఉగాది నాడు కూడా బయటకు రాని కరీం నగర్ వాసులు
ఇక ఉగాది నాడు కూడా బయటకు రాకుండా ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇక ఇప్పటికే శుభ్రతా చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం ఇంటింటికీ వెళ్లి ఆశావర్కర్లు, అంగన్వాడీ, ఏఎన్ఎంల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. అనుమానితులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఇక అధికారులు , రాజకీయ నాయకులు ప్రజలు ఇళ్ళ నుండి బయటకు రాకుండా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు .
Recommended Video
బయటకు వస్తే ప్రాణాలకు ముప్పు అని హెచ్చరిస్తున్న అధికారులు
కొందరిని ఆస్పత్రుల్లో అడ్మిట్ చేయగా మరికొందరు స్వీయనిర్భందంలో ఉన్నారు. బయటకు వస్తే, ప్రాణాలకే ముప్పని అధికారులు హెచ్చరిస్తున్నారు. 21 రోజుల పాటు జరిగే లాక్ డౌన్కు జిల్లా ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నారు అధికారులు. మార్చి 1 తర్వాత విదేశీ ప్రయాణం చేసి వచ్చిన వారికి స్టాంపింగ్ చేశారు అధికారులు. కరోనా వైరస్ ప్రభావిత దేశాలే కాకుండా ఇతర దేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిని గుర్తించి స్టాంపింగ్ చేయాలని అధికారులకు కలెక్టర్ శశాంక ఆదేశించారు.