సభలో ట్విస్ట్: జానా, కృష్ణయ్యలపై నో సస్పెన్షన్, చేయిచ్చిన ఎర్రబెల్లి
హైదరాబాద్: రైతులకు విడతలవారీగా కాకుండా ఒకేసారి రుణమాఫీ చేయాలని, అప్పుడే వారికి ఊరట కలుగుతుందని విపక్షాలు డిమాండ్ చేస్తూ శాసన సభలో నినాదాలు చేశారు. దీంతో, పలువురు విపక్ష సభ్యులను టిఆర్ఎస్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ సెషన్ మొత్తానికి వారిని సస్పెండ్ చేశారు.
అయితే, సస్పెన్షన్ నేపథ్యంలో ఆసక్తికర సంఘటనలు కనిపించాయి. మజ్లిస్ పార్టీ మినహా మిగతా విపక్షాలను అధికార టిఆర్ఎస్ సస్పెండ్ చేసింది. కాంగ్రెస్, బిజెపి, టిడిపి, వామపక్షాల సభ్యులను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారు.
అయితే, సభలోనే ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానా రెడ్డిని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను సస్పెండ్ చేయలేదు. జానారెడ్డిని సస్పెండ్ చేయకపోయినప్పటికీ... ఆయన మిగతా కాంగ్రెస్ సభ్యులతో కలిసి బయటకు వచ్చారు.
మరోవైపు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు సభకు హాజరు కాలేదు. తెలంగాణ కమిటీలో వరంగల్ జిల్లాకు చెందిన రేవూరి ప్రకాశ్ రెడ్డికి పదవి ఇవ్వడంతోనే ఆయన అసంతృప్తికి లోనై రాకపోయి ఉంటారని అంటున్నారు. కమిటీలో రేవూరికి చోటు దక్కిన పదవిపై ఎర్రబెల్లి అసంతృప్తితో ఉన్నారు.
అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఇవాళ సభ ప్రారంభంకాగానే ప్రతిపక్ష సభ్యులు రైతు సమస్యలపై మళ్లీ చర్చించాలంటూ పట్టుబట్టారు. అది సభా సాంప్రదాయంకాదని, సభను కొనసాగనివ్వాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు పొడియం వద్ద బైఠాయించి నినాదాలు చేశాయి.
దీంతో ప్రతిపక్ష సభ్యులను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. దీపం పథకంపై టీఆర్ఎస్ సభ్యురాలు కొండా సురేఖ మాట్లాడారు. దీపం పథకం కింద ఇచ్చే సిలిండర్తోపాటు గ్యాస్స్టవ్ కూడా కొనాలనే నిబంధన పేదలకు ఇబ్బందిగా మారిందన్నారు.
దీనిపై మంత్రి జగదీశ్ రెడ్డి సమాధానమిస్తూ.. అలాంటి నిబంధనేమీ లేదని, ఎక్కడైనా అలాంటిది ఉందని తెలిస్తే దానిని సరిచేస్తామని చెప్పారు. అలాగే, ఏకమొత్తంలో రైతులకు రుణమాఫీపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందిస్తూ... రుణమాఫీ ఒకేసారి చేయాలనే అంశం ముఖ్యమంత్రి కెసిఆర్ పరిశీలనలో ఉందని చెప్పారు.