మేడారంలో నేడే తిరుగువారం పండుగ: పోటెత్తిన భక్తజనం; సమ్మక్క పూజారుల కీలకప్రకటన!!
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత ఘనంగా ఈ సంవత్సరం నిర్వహించిన విషయం తెలిసిందే. మేడారం మహా జాతర ముగిసిన తర్వాత నేటి జాతరలో భాగంగా సమ్మక్క సారలమ్మ పూజారులు తిరుగు వారం పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ సంవత్సరం మేడారం మహా జాతరకు సంబంధించిన కీలక ప్రకటన చేయనున్నారు.
ఆదివాసి పూజారులు తమ గిరిజన సాంప్రదాయాల ప్రకారం సమ్మక్క సారలమ్మ గద్దెలను శుద్ధిచేసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నేడు సమ్మక్క సారలమ్మ గద్దెల చుట్టూ ఏర్పాటుచేసిన రక్షణ గ్రిల్స్ కు తాళం వేస్తారు. ఇక ఈరోజు తిరుగువారం పండుగ కాబట్టి మేడారంలో విపరీతమైన భక్తుల రద్దీ కొనసాగుతోంది.

మేడారం మహా జాతర ఈ ఏడాది 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ఘనంగా కొనసాగింది. ఇసుకేస్తే రాలనంత మంది జనం మేడారం మహా జాతరలో అమ్మవార్లను దర్శించుకున్నారు. మేడారం మహా జాతరలో సమ్మక్క సారలమ్మ వార్లను గద్దెల మీదికి తీసుకురావటం, భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం, ఆపై అమ్మవార్లు వన ప్రవేశం చేయడం జరిగాయి.
అధికార యంత్రాంగం మేడారం జాతరను సక్సెస్ చేయటానికి చాలా కష్టపడినా జాతరలో కొన్ని ఇబ్బందులు చోటు చేసుకున్నాయి. మేడారం జాతర ఫెయిల్ అయిందన్న చర్చ జరిగింది. ఇక జాతర తర్వాత తిరుగు వారం పండుగను నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం . ఈ తిరుగువారం పండుగతో మహా జాతర పరిసమాప్తం అవుతుందని పూజారులు ప్రకటిస్తారు. సమ్మక్క సారలమ్మ మహా జాతర మండ మెలిగే పండుగతో ప్రారంభమై తిరుగువారంతో నేడు ముగుస్తుంది.
ఆపై మళ్ళీ వచ్చే ఏడాది మాఘమాసంలో మళ్లీ మినీ మేడారం జాతర నిర్వహిస్తారు. అప్పుడు మళ్లీ పూజ సామాగ్రిని బయటకు తీసి అమ్మవార్లకు పూజలు చేస్తారు. ఇక ఈ తిరుగు వారం పండుగ సందర్భంగా కూడా మేడారానికి భక్తులు పోటెత్తారు. అమ్మవార్లను దర్శించుకుంటూ తిరుగువారం పండుగలో పాలుపంచుకుంటున్నారు.












Click it and Unblock the Notifications