వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే: ఈసీ కళ్లు కప్పి నేతలు యథేచ్చగా బహుమతుల పంపిణీ
"వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే" అనే సామెత అంతా వినే ఉంటాం. ఒక లక్ష్యాన్ని అందుకోవాలన్న బలమైన కోరిక ఉంటే చాలు... దాన్ని అందుకునేందుకు సవాలక్ష దారులు ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఈ సామెత బాగా వంటపట్టించుకున్నట్లున్నారు నేతలు. ఓటర్లను ప్రలోభ పెడదామంటే ఎన్నికల సంఘం డేగ కన్ను వేసి ఉంది. దీంతో వారిని ఎలాగైనా ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు ఫీట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సరికొత్త రూట్ను ఎంచుకున్నారు నేతలు. ఓటర్లకు గిఫ్ట్లు ఇచ్చేందుకు ఎలాంటి రూటు ఎంచుకున్నారో ఒక్కసారి మీరే చదవండి.

చిరుద్యోగి ఫంక్షన్కు రూ. 2 లక్షలు ఖర్చు
ఓటర్లను ఆకర్షించేందుకు నిబంధనలకు విరుద్ధంగా వెళుతున్నారు రాజకీయనేతలు. బహిరంగంగా డబ్బు కానీ బహుమతుల పేరుతో వస్తువులు కానీ ఇవ్వలేకున్నారు. ఇందుకు అడుగడుగునా ఎన్నికల సంఘం అడ్డు పడుతుండటంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల సమయం కూడా దగ్గరపడుతుండటంతో నాయకులు మరో రూటులో ఓటర్లకు బహుమతులు అందజేస్తున్నారు. తాజాగా హైదరాబాదులో ఓ చిరుద్యోగి కొడుకు పుట్టిన రోజ వేడుకలను ఇందుకోసం వినియోగించుకున్నారు. చిరుద్యోగి తన కుమారుడి బర్తడే ఫంక్షన్కు దాదాపు 200 మంది కాలనీ వాసులు వచ్చారు. ఆ ఫంక్షన్కు రూ.2 లక్షలు ఖర్చు అయ్యింది. పేరుకేమో చిరుద్యోగి మరి అంత డబ్బు ఎలా ఖర్చు చేశాడు అని ఆరా తీస్తే అసలు సంగతి వెలుగు చూసింది. పేరుకేమో చిరుద్యోగి కుమారుడి పుట్టిన రోజు.. అక్కడికి వచ్చిన కాలనీ వాసులకు మాత్రం రాజకీయ బహుమతులు. అంటే అక్కడి స్థానిక నేతలే ఈసీ కంట పడకుండా ఫంక్షన్ పేరుతో గిఫ్ట్స్ ఇచ్చి తమ పార్టీకి ఓటువేయాల్సిందిగా కోరుతున్నారు. ఇక కరీంనగర్లో కూడా ఓ టీచర్ ఇంట్లో జరిగిన పూజకు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీనికి కూడా రూ. 4 లక్షలు ఖర్చ అయ్యింది. వచ్చినవారు వెళ్లేటప్పుడు మంచి గిఫ్ట్స్ పట్టుకెళ్లారు. మరి బహుమానం తీసుకున్న వారి నోళ్లు ఊరుకుంటాయా...? వారికి గిఫ్ట్స్ ఎలా వచ్చాయో అనే సీక్రెట్ బయటకు చెప్పేయడంతో అసలు సంగతి బయటపడింది.

ఎవరి ఇళ్లలో వేడుకలున్నాయో కనుక్కోవాల్సిందిగా కార్యకర్తలకు ఆదేశాలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ నిఘా ఎక్కువైపోయింది. సభలు సమావేశాల పేరుతో నాయకులు ఎంత ఖర్చు చేస్తున్నారు , ఎలా ప్రచారం నిర్వహిస్తున్నారన్నదానిపై ఈసీ ఆరా తీస్తోంది. దీనికి తోడు మీడియా నిఘా కూడా ఉండటంతో నాయకులు గుక్క తిప్పుకోలేకున్నారు. దీంతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు నాయకులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగా వారి నియోజకవర్గాల్లో ఏదైనా వేడుకలు, ఫంక్షన్లు జరిగితే వాటిని లక్ష్యంగా చేసుకుని అక్కడికి వచ్చిన అతిథులకు ఓటు వేయాల్సిందిగా కోరుతూ పొలిటికల్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. అంతేకాదు ఎవరి ఇళ్లలో ఎలాంటి వేడుకలు జరుగుతున్నాయో కనుక్కోవాల్సిందిగా కార్యకర్తలకు నేతలు సూచిస్తున్నారు. అలా ఎవరి ఇంట్లో అయిన వేడుక ఉందని తెలిస్తే ఆ ఇంటికి వెంటనే బహుమతులు చేరిపోతున్నాయి.అంతేకాదు ఆ ఫంక్షన్కు అయ్యే ఖర్చు తామే భరిస్తామని కూడా మాట ఇస్తున్నారంటే వ్యవహారం ఏ స్థాయిలో ఉందో ఊహించొచ్చు.

క్లైమాక్స్లో నాయకుడి ఎంట్రీ... బహుమతులు ఇచ్చి ఓట్లు అభ్యర్థన
ఇక వేడుక ప్రారంభమవుతుంది. అప్పటికే అతిథులుగా ఆ కాలనీ వాసులు వచ్చేస్తారు. కార్యక్రమం బిజీగా ఉంటుంది . ఇక భోజన సమయం సమీపించగానే ఆ ఫంక్షన్ స్పాన్సర్ చేసిన నేత దిగిపోతారు. ఇక అక్కడే హడావుడి మరింత పెరుగుతుంది. తమ నాయకుడు వారి వేడుకకు వచ్చారనే కలరింగ్ కూడా ఉంటుంది. కానీ ఆ నాయకుడు ఎందుకొస్తారు అంటే అక్కడికి అతిథుల్లా చేరివచ్చిన ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు. ఈ సారి తమ ఓటు తనకే వేయాలని విజ్ఞప్తి చేస్తాడు. ఇలా తాము పంపిన కానుకల్లో కూడా కాస్త వేరియేషన్ కనిపిస్తుంది. ఏ వయస్సు వారికి ఆ కానుకలు ఇచ్చేలా పక్కా గిఫ్టులు ముందుగానే తీసుకొచ్చేస్తారు. ఒకవేళ ఎవరి ఇళ్లలో వేడుకలు లేకపోతే... కార్యకర్తల ఇళ్లలోనే ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తారు. ఇలా కార్యక్రమాల పేరుతో మొత్తానికి ఈసీ కళ్లు కప్పి ఎన్నికల బరిలో నిలిచిన నాయకులు ఓటర్లను కానుకలతో ప్రలోభ పెడుతున్నారు.












Click it and Unblock the Notifications