మునుగోడు లో రేవంత్ కొత్త ప్లాన్ - ఇక ఆర్జీ పాల్ గా పిలవాలి..!!
మునుగోడు బై పోల్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ సమర్ధతకు పరీక్షగా మారుతోంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే కాంగ్రెస్ మనుగోడులో సభ ఏర్పాటు చేసింది. మనుగోడు కాంగ్రెస్ అడ్డా అని..పార్టీ అభ్యర్దిగా ఎవరు పోటీ చేసినా గెలుపు ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. తాజాగా టికెట్ ఆశిస్తున్న మహిళా అభ్యర్ధి వీడియో కాల్ వైరల్ అయింది. సీనియర్లు బీసీ అభ్యర్ధికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

పాదయాత్రకు నిర్ణయం
మునుగోడులో పార్టీ సీనియర్లు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 13వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇక, టీపీసీసీ చీఫ్ రేవంత్ ఈ నెల 17న పాదయాత్రలో పొల్గొంటారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఉందని..అభ్యర్ధి ఎంపిక నుంచి ప్రచారం వరకు ప్రణాళికా బద్దం గా వ్యవహరిస్తే గెలుపు సాధ్యమేనని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. పార్టీ అనుబంధ సంస్థల ప్రతినిధులతోనూ సమావేశం జరిగింది. అందులో టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేసారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఇక నుంచి ఆర్జీ పాల్ అని పిలవాలంటూ సూచించారు.

ఏఐసీసీ ఫోకస్.. కీలక నిర్ణయాలు
ఏఐసీసీ సైతం తెలంగాణలో జరగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా.. ఇద్దరు ఏఐసీసీ కార్యదర్శు లకు కొత్తగా నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించింది. మునుగోడు బై పోల్ ను సీరియస్ గా తీసుకోవాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాకూర్ స్పష్టం చేసారు. ఈ నెల 21న కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా మునుగోడు పర్యటన దాదాపు ఖరారైంది. మునుగోడులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభలో అధికారికంగా బీజేపీలో చేరేందుకు రాజగోపాల్ రెడ్డి ముహూర్తంగా నిర్ణయించుకున్నారు.

మునుగోడులో త్రిముఖ పోటీ
మరి కొందరు నేతలు సైతం ఇతర పార్టీ నుంచి అదే సభలో బీజేపీలో చేరనున్నారు. ఆ రోజు నుంచే బీజేపీ అధికారిక ప్రచారం ప్రారంభం కానుంది. ఇటు టీఆర్ఎస్ తమ అభ్యర్ధి ఎంపిక కసరత్తు కొలిక్కి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజగోపాల్ రాజీనామాను వెంటనే స్పీకర్ ఆమోదించటం..అసెంబ్లీ నోటిఫికేషన్ జారీ చేయటంతో ..ఇక, కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నవంబర్ లోగానే ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని పార్టీలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఈ ఎన్నిక మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ కు కీలకం కానుంది.












Click it and Unblock the Notifications