కేసీఆర్ ను ఎదుర్కునేంత స్టామినా ఉత్తమ్ కు ఉందా?, ప్రజెంటేషన్ తో మెప్పించారా?
హైదరాబాద్ : మాటల్లోను.. రాజకీయంలోను కేసీఆర్ తో సరితూగే సమవుజ్జీ ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో మరెవరూ లేరన్నది అత్యంత సుస్పష్టం. అందుకే గోడ దూకే పార్టీ నేతలను సైతం కాపాడుకోవడంలోను తెలంగాణ ప్రతిపక్షాలు విఫలమయ్యాయి. ఒకవిధంగా ఇప్పుడు ప్రతిపక్షాల ఆరాటమంతా తమ ఉనికిని మరింత ప్రశ్నార్థకం కాకుండా కాపాడుకోవడమే.
ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ సర్కార్ రీ డిజైనింగ్ ల పేరుతో భారీ ఎత్తున అవినీతి అవకతవకలకు పాల్పడుతుందంటూ కాంగ్రెస్ ఆరోపించడం మొదలుపెట్టింది. ఇక సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి.. అటు జనం చేత, ఇటు మీడియా చేత ప్రశంసలందుకోవడం కాంగ్రెస్ ను మరింత సంకట స్థితిలోకి నెట్టింది.
కేసీఆర్ చెబుతున్నవన్నీ అవాస్తవాలని కేవలం మాటలకే పరిమితమైపోయే.. విని, విని జనాలకూ విసుగొచ్చే పరిస్థితి. కాబట్టి.. ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో సహా కేసీఆర్ చెబుతున్నవి అసత్యాలని నిరూపించుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ కు ఏర్పడింది. ఇదే క్రమంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సిద్దమైన కాంగ్రెస్.. గత మే31న పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ ఈ ప్రజెంటేషన్ ఇస్తారని ప్రకటించింది.
ఏమైందో ఏమో తెలియదు గానీ, అనుకున్న తేదీ నాటికి ఉత్తమ్ కు జ్వరం పట్టుకుందని ప్రజెంటేషన్ ను వాయిదా వేశారు కాంగ్రెస్ నాయకులు. ఏదైనా సరే తెగేదాక లాగొద్దన్నట్లు.. ప్రజెంటేషన్ విషయాన్ని కాంగ్రెస్ మాత్రం లాగుతూనే వచ్చింది. మొత్తానికి ఇంత జాప్యం తర్వాత నేటి మధ్యాహ్నాం రావి నారాయణరెడ్డి అడిటోరియంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తోంది కాంగ్రెస్.
ఉత్తమ్ మెప్పించగలరా..?
ఎట్టకేలకు కాంగ్రెస్ నేతలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు గానీ.. ఎంతమేర జనాన్ని మెప్పించారన్నదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. అందులోను ప్రాజెక్టులకు సంబంధించిన సబ్జెక్టు మీద కేసీఆర్ కు ఉన్నంత అవగాహన కాంగ్రెస్ నేతలకు ఉందా? లేదా? అన్నది ఈ ప్రజెంటేషన్ తో తేటతెల్లమయింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను కాంగ్రెస్ ఏదో మొక్కుబడిగా పూర్తి చేసిందే తప్పితే.. కేసీఆర్ ను భయపెట్టేంత స్థాయిలో ప్రజెంటేషన్ లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ప్రజెంటేషన్ ఇచ్చిందన్న మాటే గానీ.. ప్రజెంటేషన్ గురించి అటు మీడియాలోను, ఇటు జనాల్లోను అంతగా చర్చే లేదు. మరి ప్రజంటేషన్ విషయంలో కాంగ్రెస్ సఫలమైనట్టా..? విఫలమైనట్టా..? అన్నది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భమేమో!