దూకుడు పెంచనున్న కాంగ్రెస్.!శిక్షణా తరగతులతో వ్యూహాలకు పదునుపెట్టనున్న టీపీసిసి.!
హైదరాబాద్ : నీళ్లు.. నిధులు.. నియామకాలు లక్ష్యంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని అంశాల్లో వెనకబడిపోవడమే కాకుండా అనేక వర్గాల ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తెలంగాణ సాధించుకుని ఏడేళ్లు పూర్తి చేసుకుంటున్నప్పటికి సామాజిక న్యాయం దిశగా అడుగులు వేయలేకపోయామనే అభిప్రాయాన్ని టీపిసిసి వ్యక్తం చేస్తోంది. తెలంగాణ సమాజం అభ్యున్నతి దిశగా అడుగులు వేయాలన్నా, నీళ్లు నిధులు నియామకాల్లో సమన్యాయం జరగాలన్నా మరో ఉద్యమం తప్పదని, అందుకు తగ్గట్టుగా కార్యాచరణ ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది.

వన్ షాట్.. టూ బర్డ్స్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై టీపిసిసి పోరాటం..
ఆత్మ బలిదానాల ద్వారా సాధించుకున్న స్వరాష్ట్రంలో నిధులు, నియామకాలు, నీళ్లు కూడా ప్రజలకు అందే పరిస్థితి లేదని, అధికార పార్టీ అసమర్థ విధానాల వల్ల ఇప్పటికే దక్షిణ తెలంగాణ జిల్లాలు ఎడారిలా మారే పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ పార్టీ విశ్లేషిస్తోంది. ఏపీ ప్రభుత్వం ఇష్టంవచ్చినట్లు కడుతున్న రాయలసీమ సంగమేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకోలేని దుస్ధితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ పార్టీ ఘాటు విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనుముతులు మంజూరైన పాలమూరు-రంగారెడ్డిని ప్రాజెక్టును కూడా నిర్వీర్యం చేసేలా ఏపీ ప్రభుత్వంతో చేతులు కలిపి సొంత ప్రజలపై కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

తెలంగాణకు నష్టం జరుగుతోంది.. మేల్కోకపోతే మరిన్ని కష్టాలు తప్పవన్న కాంగ్రెస్
తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యాచరణ రూపొందించకపోతే తెలంగాణ సమాజానికి మరింత నష్టం జరిగే అవకాశం ఉందని టీపిసిసి ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే యాక్షన్ ప్లాన్ సిద్దం చేసి క్షేత్ర స్దాయిలో ప్రజల మద్యకు వెళ్లాలని ప్రణాళిక రచిస్తోంది కాంగ్రెస్. అందులో భాగంగా నవంబర్ 1వ తేదీన గాంధీభవన్లో డిజిటల్ మెంబర్ షిప్ ని లాంచ్ చేసి రాబోవు మూడు నాలుగు మాసాల్లో 30 లక్షల పైగా మెంబర్షిప్ పూర్తి చేసే విధంగా పావులు కదుపుతోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.

జాగరణ యాత్ర, జంగ్ సైరన్, శిక్షణ తరగతులు.. టీపిసిసి దూకుడే దూకుడు
అంతే కాకుండాకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల ని వివరిస్తూ, నవంబర్ 14 నుండి ఏడు రోజుల పాటు జన జాగరణ పాదయాత్ర జరుగుతుందని, కార్యకర్త స్థాయి నుండి అందరూ ఈ పాదయాత్రలో పాల్గొనాలని టీపీసిసి పిలుపునిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సంవత్సరం పాటు 75 వసంతాల ఉత్సవాలను జరుపుకోవడానికి ఒక కమిటీ వేస్తున్నట్టు ప్రకటించింది టీపిసిసి. దాంతో పాటు నవంబర్ 9 , 10 తేదీలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుతో కలిసి శిక్షణా తరగతులను సన్నాహాలను చేస్తున్నట్టు పీసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. త్వరలో 119 నియోజకవర్గాలకు కోర్దనేటర్లని నియమిస్తామని తెలిపారు.
Recommended Video

తగ్గేదిలే.. సత్తా చాటుతామంటున్న పీసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి..
ఇదిలా ఉండగా డిసెంబర్ 9 న చలో హైదరాబాద్ నినాదం తో లక్షలాది మంది విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ చేపడతామని, ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రాహుల్ గాంధి గారు హాజరవుతారని టీపిసిసి నేతలు స్పష్టం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్, పప్పు దినుసుల రేట్లు అనేక రేట్లు పెరగడంతో సామాన్యుడి కీ భారంగా మారాయని, మతం పేరుతో సమాజాన్ని విడదీసి పాలిస్తున్న బిజెపి, దానికి మద్దతు పలుకుతున్న టిఆర్ఎస్ పార్టీలకు చరమగీతం పాడితేనే అస్థవ్యస్ధమైన నిరుద్యోగ బతుకులు బాగుపడుతాయని అందుకోసం ఈనెల 9,10తేదీల్లో పార్టీ నేతలకు కీలక శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications