Black fungus: తెలంగాణలో హోమియోపతి మెడిసిన్ రెడీ: ఆ రెండింటి వాడకానికి గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి బారి నుంచి కోలుకొన్న వారిని బ్లాక్ ఫంగస్ (Black Fungus) ఇన్ఫెక్షన్ వెంటాడుతోంది. ప్రాణాలను హరించి వేస్తోంది. ఈ తరహా కేసులు తెలంగాణలో భారీగా పెరుగుతున్నాయి. ఆందోళనకు గురి చేస్తోన్నాయి. దీన్ని నియంత్రించడానికి ఉద్దేశించిన యాంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్లు ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. రాష్ట్రంలో వెలుగులోకి వస్తోన్న బ్లాక్ ఫంగస్ కేసులకు అనుగుణంగా కేంద్రం నుంచి ఈ ఇంజెక్షన్లు రావాట్లేదనే అసంతృప్తి కూడా తెలంగాణ ప్రభుత్వంలో వ్యక్తమౌతోంది. గుజరాత్కు భారీగా వాటిని కేటాయించారంటూ మంత్రి కేటీఆర్ అభ్యంతరం చెప్పారు.
ఈ పరిస్థితుల్లో బ్లాక్ ఫంగస్ బారిన పడికి అవసరమైన చికిత్స కోసం హోమియోపతిని ఆశ్రయించింది కేసీఆర్ సర్కార్. హోమియోపతి మెడిసిన్ (Homeopathy Medicine) ద్వారా బ్లాక్ ఫంగస్కు అడ్డకట్ట వేయాలని నిర్ణయించింది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతోన్న వారికి అందజేసే ట్రీట్మెంట్లో హోమియోపతిని కూడా చేర్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్ నివారణకు ఆయుష్ వైద్య విధానంలో చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేసింది.
హోమియోపతిలో వినియోగించే ఆర్సెనిక్-ఏఎల్బీ 200 (Arsenic-Alb 200) మెడిసిన్ వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటిని ఎలా వినియోగించాలనే విషయంపైనా మార్గదర్శకాలను విడుదల చేసింది. క్వాలిఫైడ్ హోమియోపతిక్ ఫిజీషియన్ పర్యవేక్షణలో మాత్రమే వాడాలని సూచించింది. కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ముకోర్మైకోసిస్ లక్షణాలతో బాధపడుతున్న వారు ఆర్సెనిక్-ఏఎల్బీ 200 పిల్స్ను రోజూ రెండు పూటల చొప్పున వాడాలని సూచించింది. ఒక్కో పూటలో ఆరు పిల్స్ మింగాల్సి ఉంటుందని, ఇలా అయిదు రోజులు చేయాలని పేర్కొంది.
దీనితోపాటు- ఫైవ్. పీహెచ్ఓఎస్ 6 ఎక్స్ (Five. Phos 6x) టాబ్లెట్లను కూడా వినియోగించవచ్చని సూచించింది. రోజూ రెండు పూటలా మూడు ట్యాబెట్ల చొప్పునవాటిని తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇలా 30 రోజుల పాటు కొనసాగించాల్సి ఉంటుందని తెలిపింది. రైనొసెరెబ్రిల్ ముకోర్మైకోసిస్, పల్మనరీ ముకోర్మైకోసిస్, క్యుటానియస్ ముకోర్మైకోసిస్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ముకోర్మైకోసిస్ కోసం ప్రత్యేకంగా హోమియోపతి మెడిసిన్ను వాడుకోవచ్చని తెలిపింది. తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం వలన బ్లాక్ ఫంగస్ బారి నుంచి కోలుకోవచ్చని తెలిపింది.