సిఎం రమేష్ లేఖ: చంద్రబాబుపై భగ్గుమన్న టిఆర్ఎస్ నేతలు
హైదరాబాద్: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలు అక్రమ ప్రాజెక్టు అంటూ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ లేఖ రాయడంపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నేతలు భగ్గుమ్నారు. కళ్ల ముందు కుట్రలను అర్థం చేసుకోలేని సన్నాసులు తెలుగుదేసం పార్టీ తెలంగాణ నేతలని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి అన్నారు.
పాలమూరు ఎత్తిపోతల అనుమతి లేని ప్రాజెక్ట్ అని రాజ్యసభకు టీడీపీ ఎంపీ సీఎం రమేష్ లేఖ పంపడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. తెలంగాణకు నీళ్లు రావొద్దని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, చంద్రబాబు కుట్రలకు కేరాఫ్ అడ్రస్గా మారాడని ఆయన దెప్పిపొడిచారు.
పాలమూరు ప్రాజెక్టు కొత్తదికాదన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించాలని, సమైక్య రాష్ట్రంలోనే పాలమూరు ఎత్తిపోతలకు అనుమతులు వచ్చాయని, ఎవరు అడ్డొచ్చినా పాలమూరు ఎత్తిపోతల కట్టితీరుతమని ఆయన అన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణకు నష్టం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని రాజకీయ విళ్లేషకులు వి. ప్రకాశ్ అన్నారు. పాలమూరు ఎత్తిపోతల అనుమతి లేని ప్రాజెక్ట్ అని రాజ్యసభకు టీడీపీ ఎంపీ సీఎం రమేష్ లేఖ పంపడంపై ఆయన స్పందించారు.
మొదటి నుంచి చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు కుట్రలు మరోసారి బట్టబయ్యాయని ఆయన అన్నారు. తెలంగాణ బాగుపడటం చంద్రబాబుకు ఇష్టంలేదని, బాబు హయాంలో పాలమూరులో ఒక్కప్రాజెక్టూ పూర్తికాలేదని ఆయన అన్నారు. చట్ట ప్రకారం మనకు రావాల్సిన నీటివాటాను మాత్రమే వాడుకుంటున్నామని, ఇప్పటికైనా తెలంగాణ టీడీపీ నేతలు కళ్లు తెరవాలని ఆయన అన్నారు.