టిఆర్ఎస్ నేత అదృశ్యం: ఆచూకీ కోసం పోలీసుల లుకౌట్ నోటీసులు
హైదరాబాద్: నగరంలో మరో ప్రముఖ వ్యక్తి అదృశ్యమయ్యారు. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి ముషీరాబాద్ నియోజకవర్గ ఇంఛార్జీగా వ్యవహరించిన ప్రముఖ వ్యాపారి ఆగిరి వెంకటేశ్ మూడు రోజులుగా కనిపించడం లేదు.
గతంలో వాసవి క్లబ్ అధ్యక్షుడిగానూ వ్యవహరించిన వెంకటేశ్ ఫైనాన్స్ , రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన మళ్లీ తిరిగి రాలేదు.
దీంతో ఆందోళనకు గురైన ఆయన కుటుంబసభ్యులు ముషీరాబాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులకు ఇంతవరకు ఏ ఒక్క చిన్న క్లూ కూడా లభించలేదు. ఈ నేపథ్యంలో వెంకటేశ్ ఆచూకీ కోసం నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.
వృద్ధురాలి మంగళసూత్రం మాయం
ఓ వృద్దురాలి మెడలోంచి మంగళసూత్రాన్ని లాక్కెల్లిన సంఘటన కార్ఖాన పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. విక్రంపురిలో నివాసముంటున్న గాయత్రీ పటేల్(60) బుధవారం వస్తువుల కొనుగోలు కోసం షాపుకెళ్లింది.
ఇద్దరు వ్యక్తులు వెనుక నుంచి బ్లాక్ పల్సర్ వాహనంపై వేగంగా దూసుకొచ్చి ఐదున్నర తులాల బంగారు మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. కార్ఖాన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.