రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆ పనిచేయాలి... త్వరలోనే ఆ చిట్టా మొత్తం బయటపెడుతా... : గువ్వల బాలరాజు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి దమ్ముంటే హుజురాబాద్లో పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సవాల్ విసిరారు.టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో జరుగుతున్న సంక్షేమం,అభివృద్ధి గురించి అన్ని వర్గాలకు తెలుసన్నారు. కానీ రేవంత్ అనే మూర్ఖుడికి మాత్రం అర్థంకావడం లేదని విమర్శించారు.తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన సీఎం కేసీఆర్పై విమర్శలు చేస్తే సహించబోమని అన్నారు.
బ్లాక్మెయిల్చేసి సంపాదించిన డబ్బుతో రేవంత్ రెడ్డి దొంగదీక్షలు చేస్తున్నాడని గువ్వల బాలరాజు ఫైర్ అయ్యారు. 'మూడుచింతలపల్లిలో కూర్చొని తొక్కుతా అని మాట్లాడుతున్నావ్.. నువ్వా మమ్నల్ని తొక్కేది.. గొంతుపట్టి పిసికితే చచ్చిపోతవు' అని విరుచుకుపడ్డారు. అసలు సిసలైన ఆత్మగౌరవ సభావేదిక ఎలా ఉంటుందో... మల్కాజిగిరిలో చూపిస్తా... రా అంటూ సవాల్ విసిరారు. దళితులకు ఇచ్చే రూ.10లక్షలు బోడి అనడాన్ని తప్పు పట్టారు.
కొడంగల్ ప్రజలు ఓడిస్తే మల్కాజిగిరికి వచ్చిపడ్డ రేవంత్ రెడ్డి... ఇక్కడ కూడా ఏదో అత్తెసరుగా గట్టెక్కాడని పేర్కొన్నారు. రేవంత్ ఊరిలో ఎన్నోసార్లు టీఆర్ఎస్ గెలిచిందన్నారు. పీసీసీ పదవి రాగానే రేవంత్ సీఎం అయినట్టు ఫోజులు కొడుతున్నాడని.. ఆయనతో రావడానికి సొంతపార్టీ నేతలే ఇష్టపడటం లేదని విమర్శించారు.
రేవంత్ ఆదేశాలతోనే సీతక్క చంద్రబాబు కాళ్లు మొక్కుతోందన్నారు. అసలు రేవంత్ను నడిపిస్తున్నదెవరో అందరికీ తెలుసన్నారు.తెలంగాణ నుంచి దోచుకున్న డబ్బుతో చంద్రబాబు రేవంత్ రెడ్డిని పోషిస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ ఎంపీ అయ్యాక.. ఎంతమంది వ్యాపారుల వద్ద నుంచి డబ్బులు తీసుకున్నాడో... ఆ సమాచారమంతా తమ వద్ద ఉందని అన్నారు. త్వరలోనే ఆ చిట్టా బయటపెడుతానని చెప్పారు. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో రేవంత్ చిప్ప కూడు తిన్నాడని... ఇక అంతకుమించిన శిక్ష ఏమి ఉంటుందని అన్నారు. అందుకే తెగేసి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
'మా అయ్య పోలీస్ పటేల్... మా తాత ఇంకో పటేల్... నేనొక బుడ్డరఖాన్' అంటూ రేవంత్ చెప్పే విషయాలన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. రేవంత్కు అన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడివని ప్రశ్నించారు. అడ్డంగా సంపాదించిన డబ్బుతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని... కొత్తబిచ్చగాడులా నోటికి అడ్డూ అదుపులేకుండా పోయిందని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ,కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్ భవిష్యత్తులో దేశానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు.
మేడ్చల్ జిల్లాలోని మూడుచింతలపల్లిలో రేవంత్ రెడ్డి 48 గంటల పాటు దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై,పలువురు మంత్రులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డిని జోకర్,బ్రోకర్ అంటూ దూషించారు.మల్లారెడ్డి అనుమతి తెచ్చుకున్న యూనివర్సిటీ స్థలం కబ్జా స్థలమని.. తప్పుడు పత్రాలు చూపించి అనుమతి పొందారని ఆరోపించారు
రేవంత్ ఆరోపణలు,విమర్శలపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి తనతో పోటీ చేయాలని సవాల్ విసిరారు. రేవంత్ గెలిస్తే తాను రాజకీయాల్లో నుంచే తప్పుకుంటానని అన్నారు. వేశంతో ఊగిపోయిన మల్లారెడ్డి.. ప్రెస్ మీట్లో తొడగొట్టి మరీ రేవంత్కు సవాల్ విసిరారు.