ఆ నలుగురు నేడే విడుదల : పైలట్ రోహిత్రెడ్డి కీలక నిర్ణయం...!!
ఆ నలుగురు ఎమ్మెల్యేలు. తెలంగాణతో పాటుగా జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ నుంచి బయటకు రానున్నారు. ఫాం హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బాధితులుగా చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గత 22 రోజులుగా ప్రగతి భవన్ లోనే ఉంటున్నారు. ఈ రోజు నుంచి వారు తమ నియోజకవర్గాలకు వెళ్లనున్నారు. ఫాం హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటకు వచ్చిన తరువాత ఎమ్మెల్యేలు రోహిత్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లారు.

22 రోజుల తరువాత బయటకు
అప్పటి నుంచి ఆ నలుగురు ప్రగతి భవన్ లోనే ఉన్నారు. మధ్యలో మునుగోడు ఎన్నికల ప్రచారానికి వెళ్లే సమయంలో సీఎం కేసీఆర్ ఆ నలుగురిని వెంట తీసుకెళ్లారు. వేదిక పైన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన వారిగా పరిచయం చేసారు. ఇన్ని రోజులు ఈ నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ లోనే ఉండటం పైన రాజకీయంగా నూ విమర్శలు ఎదురయ్యాయి. ఇద్దరు ఎమ్మెల్యేలు కనిపించడంలేదంటూ వారి నియోజకవర్గాల్లో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. తాండూరు, కొల్లాపూర్ ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి కనిపించడం లేదంటూ కాంగ్రెస్ నాయకులు కొల్లాపూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు.

తాండూరులో పట్నంకు పైలెట్ దెబ్బ
ఇక, ఇప్పుడు బయటకు వస్తున్న నలుగురు ఎమ్మెల్యేలు నేరుగా తమ నియోజకవర్గాలకు వెళ్లనున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో కీలకంగా వ్యవహరించిన తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి.. ఇకపై తాను నియోజకవ ర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని నిర్ణయించారు. నియోజకవర్గంలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి వర్సస్ రోహిత్ రెడ్డి అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో రోహిత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు దగ్గరయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు సీటు ఖాయమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖాయమని ఇప్పటికే ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

రోహిత్ రెడ్డి కీలక నిర్ణయం
దీంతో, తాండూరులో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో పల్లె పల్లెకు పైలట్ పేరిట నియోజకవర్గంలో పర్యటించి సమస్యలను గుర్తించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని రోహిత్ నిర్ణయించారు. ఇప్పటికే రోహిత్ కు ప్రత్యేకంగా భద్రత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు కొనుగోలు అంశంలో స్వయంగా ముఖ్యమంత్రి వీడియోలను విడుదల చేసారు. ఇప్పటికే సిట్ ఈ వ్యవహారం పైన విచారణ చేస్తోంది. దీంతో..ఇప్పుడు బయటకు వస్తున్న ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఏం చెప్పబోతున్నారనేది మరింత ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications