సిద్దిపేట కోసం మేం బలి: హరీష్కి సబిత సవాల్, ఎన్టీఆరే... కెసిఆర్ ఎంత: కోమటిరెడ్డి
హైదరాబాద్: ఒక ఇంట్లో (కెసిఆర్ ఇంట్లో) నాలుగు పదవులు ఉన్నప్పుడు ఒక జిల్లాకు రెండు నదుల నీళ్లు ఇస్తే తప్పేమిటని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రా రెడ్డి మంగళవారం అన్నారు.
ప్రాణహిత ప్రాజెక్టు నుంచి రంగారెడ్డి జిల్లాను ఎందుకు తీసివేశారని ఆమె నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి జరగలేదని టిఆర్ఎస్ నేతలు చెప్పడం విడ్డూరమన్నారు. హైదరాబాదులోను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.
హైదరాబాదుకు కృష్ణా నీళ్లు, మెట్రో రైలు, ఔటర్ రింగ్ రడ్డు నిర్మాణం కాంగ్రెస్ పార్టీ ఘనత కాదా అని ప్రశ్నించారు. తమ హయాంలో హైదరాబాదుకు ఏం చేశామో చెప్పేందుకు మేం సిద్ధమని, మంత్రి హరీష్ రావు చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు.

ప్రాణహిత నుంచి రంగారెడ్డి జిల్లాను ఎందుకు తీసివేస్తున్నారన్నారు. గజ్వెల్, సిద్దిపేటలలో చెరువులను నింపుకునేందుకే అలా చేస్తున్నారని మండిపడ్డారు. గజ్వెల్ వరకు 620 కిలో మీటర్ల దూరం వరకు ప్రాణహితను ఇస్తున్నారని, మిగిలిన 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లాకు ఎందుకివ్వరని ప్రశ్నించారు.
ప్రాజెక్టుల డిజైన్లను మార్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. గజ్వెల్, సిద్దిపేట చెరువులను నింపుకునేందుకు రంగారెడ్డి జిల్లాను బలి చేస్తున్నారని ఆరోపించారు. ఒక ఇంట్లో నాలుగు పదవులు ఉన్నప్పుడు ఒక జిల్లాకు రెండు నదుల నీళ్లు ఇస్తే తప్పులేదన్నారు.
చైనా పర్యటన ఖర్చుతో రుణమాఫీ చేయొచ్చు: కోమటిరెడ్డి
సీఎం కెసిఆర్ చైనా పర్యటనకు పెట్టిన ఖర్చును రుణమాఫీకి ఇవ్వవచ్చునని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ధర్నాల పైన హరీష్ రావు వ్యాఖ్యలు విడ్డూరమన్నారు. రైతుల ఆత్మహత్యలపై మీడియాలో కథనాలను హరీష్ రావు చూడాలన్నారు. కెసిఆర్ అధికారం శాశ్వతం అనుకుంటున్నారని, ఇందిర, ఎన్టీఆర్ లాంటి వారే ఓడారని.. కెసిఆర్ ఎంత అన్నారు.
అవగాహన లేని పాలకుల వల్లే ఆత్మహత్యలు: భట్టి
రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పాలన్న ఇంగితజ్ఞానం కూడా తెలంగాణ ప్రభుత్వానికి లేదని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రైతుల కుటుంబాలను కెసిఆర్, హరీష్, కెటిఆర్ పరామర్శించాలన్నారు. అవగాహన లేని పాలకుల వల్లే ఆత్మహత్యలు అన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో రాష్ట్రంపై వేలకోట్ల భారం పడుతోందన్నారు.












Click it and Unblock the Notifications