ఎవరు గెలిస్తే 'ధర్మ విజయం' అవుతుంది?
తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతాపార్టీ.. రెండు పార్టీలు మునుగోడు ఉప ఎన్నికను గెలుచుకోవడానికి శతథా ప్రయత్నించాయి. రౌండ్ రౌండ్ కు గులాబీ దళం మెజారిటీని పెంచుకుంటూ వెళుతోంది. రౌండ్ రౌండ్ కు కమల దళం తగ్గిపోతూ వస్తోంది. చివరకు 10,191 ఓట్ల మెజారితీ కారు తన జోరును చూపించింది. టీఆర్ఎస్ విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి.

ధర్మానికి, అధర్మానికి తేడా ఏమిటి?
బీజేపీ నేతలు నైతిక విజయం తమదేనని, వారిది అధర్మ విజయమని వ్యాఖ్యానించారు. అసలు ఎవరు గెలిస్తే ధర్మ విజయమవుతుంది? ఎవరు గెలవకపోతే అధర్మ విజయమవుతుందంటూ ప్రజల్లో చర్చ నడుస్తోంది. రెండు పార్టీలు మునుగోడును గెలుచుకోవడానికి హోరాహోరీగా ప్రయత్నించాయి. దేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా మారిపోయిందంటూ వార్తలు వచ్చాయి. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చుపెట్టారు. పచ్చనోట్ల యథేచ్ఛగా రాజ్యమేలాయి. కోమటిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత అధికార పార్టీ మునుగోడు నియోజకవర్గానికి నిధులు విడుదల చేసింది.

ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే ఉంటే అభివృద్ధి చేయరా?
అంటే.. ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు తెలంగాణకు చెందరా? అని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మునుగోడు ఉప ఎన్నిక కోసం ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి ప్రజలు చెల్లించినదే. వారి నుంచి పన్నుల రూపేణా వసులు చేసిన సొమ్ములతో వారి అభివృద్ధికి బాటలు పరుస్తారని ఎన్నుకుంటే వేరే పార్టీ కాబట్టి, వేరే పార్టీకి చెందిన అభ్యర్థి కాబట్టి నిధులివ్వకుండా ఉండటం.. అభివృద్ధి చేయకుండా ఉండటం.. అనేది ఏ రాజనీతి శాస్త్రం నుంచి ప్రభుత్వం నేర్చుకుందని రాజనీతి శాస్త్ర నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నిధులు విడుదల చేయడంలేదంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఉందా? లేదా? అనే సందేహం అందరికీ కలుగుతోంది.

మునుగోడు నేర్పుతున్న పాఠలెన్నో
కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలవంతంగా ఉప ఎన్నికను మునుగోడు ప్రజలపై రుద్దారు. టీఆర్ఎస్ తరఫునైతే ఒకవిధంగా, బీజేపీ తరఫునైతే మరోవిధంగా అన్నట్లుగా అధికార యంత్రాంగం వ్యవహరించింది. ఎన్నికల కమిషనరే సరిగా వ్యవహరించడంలేదంటూ కిషన్ రెడ్డి, బండి సంజయ్ విమర్శించారు. ధర్మ విజయం, అధర్మ విజయమంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న బీజేపీకి నైతికత గురించి, ధర్మం గురించి మాట్లాడే హక్కు లేదని సీనియర్ రాజకీయవేత్తలు అంటున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు ఎంత ఖరీదైనవిగా మారతాయనేది.. అతి ఖరీదైన ఉప ఎన్నికగా మారిన మునుగోడు రాజకీయ పార్టీలన్నింటికీ హెచ్చరికలు పంపించింది. ఆర్థిక బలం, అంగబలం పుష్కలంగా ఉన్న పార్టీలు, అభ్యర్థుల మధ్య హోరాహోరీగా జరిగిన మునుగోడు పోరు రాజకీయ పార్టీలకు, ప్రజలకు నేర్పే పాఠాలెన్నో!.












Click it and Unblock the Notifications