అగమ్యగోచరంగా ఆర్టీసీ కార్మికుల పరిస్థితి-ఇంకా అందని వేతనాలు-ఆర్థిక ఇబ్బందులతో సతమతం
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జూన్ నెల సగం రోజులు గడిచిపోయినా... ఇప్పటికీ కార్మికుల వేతనాలకు దిక్కు లేదు. దీంతో కార్మికులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఇంటి అద్దెలు చెల్లించలేక,కుటుంబ అవసరాలు తీర్చలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం పీర్సీ పెరిగి వారు సంబరాల్లో ఉంటే... ఆర్టీసీ కార్మికులు మాత్రం నెల జీతాలు లేక అల్లాడుతున్న పరిస్థితి నెలకొంది.

లాక్డౌన్తో నష్టాల్లో ఆర్టీసీ...
ఎప్పుడూ నష్టాలు వెంటాడే ఆర్టీసీకి కరోనా లాక్డౌన్ రూపంలో గట్టి దెబ్బ తగిలింది. గతేడాది లాక్డౌన్ తర్వాత నెమ్మదిగా గాడినపడిన ఆర్టీసీకి కరోనా రెండో వేవ్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్తో కోలుకోలేని దెబ్బ పడింది. రోజుకు కేవలం రూ.2కోట్లు ఆదాయం కూడా రాకపోవడంతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. అంతరాష్ట్ర సర్వీసులను నిలిపివేయడంతో ఆదాయం పడిపోయింది. గ్రేటర్లో తిప్పుతున్న బస్సులు డీజిల్ ఖర్చులకే సరిపోవట్లేదు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం జీతాల విషయంలో చేతులెత్తేసింది.

వేతనాలకు రూ.118 కోట్లు కావాలి...
ప్రస్తుతం ఆర్టీసీ ఖాతాల్లో నగదు లేదు. కార్మికులందరికీ వేతనాలు ఇవ్వాలంటే కనీసం రూ.118 కోట్లు కావాలి. గతంలో మాదిరే ప్రభుత్వం సాయం చేస్తే తప్ప కార్మికులకు వేతనాలు అందే పరిస్థితి కనిపించట్లేదు. నిజానికి ఆర్టీసీకి రూ.1000 కోట్ల బ్యాంకు రుణం ఇప్పించేందుకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినా అది ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కార్మికులు ఆందోళన బాట పట్టే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి తమకు జీతాలు వచ్చేలా చూడాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మెజారిటీ ఉద్యోగులకు తక్కువ వేతనాలే...
నిజానికి ఆర్టీసీ కార్మికుల్లో మెజారిటీ ఉద్యోగుల జీతాలు రూ.30వేలకు దిగువనే ఉంటాయి. సామాన్య,దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఉద్యోగులే ఎక్కువగా ఉంటారు. నెల జీతంపై ఆధారపడి బతికే వీరంతా... 5వ తేదీ అందాల్సిన వేతనం ఇప్పటికీ అందకపోవడంతో దిగులు చెందుతున్నారు. వేతనం ఎప్పుడొస్తుందో తెలియక... కుటుంబ ఖర్చులకు మళ్లీ బయట అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే...
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆర్టీసీకి రూ.3వేల కోట్లు కేటాయించింది. ఆ నిధుల నుంచే గత నెల వరకు వేతనాలు అందించింది. అయితే ఈ నెల నుంచి పీర్సీ అమలుతో ప్రభుత్వ ఖజానాపై మరో రూ.12వేల కోట్లు వరకు భారం పడనుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలకే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుండగా.. ఆర్టీసీ కార్మికుల వేతనాలపై ప్రభుత్వం ఇప్పటికైతే స్పందించలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications