గవర్నర్ మీదనే ఆశలు: రాజ్ భవన్ కు ఆర్టీసీ జేఏసీ: ప్రగతి భవన్ లో ఇలా..సాయంత్రానికి తేలిపోతుందా..!
తెగని సమస్యగా మారిన తెలంగాణ ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో ఇప్పుడు కార్మికులు గవర్నర్ వైపు చూస్తున్నారు. తమ సమస్యల మీద కలిసిన తరువాత గవర్నర్ నేరుగా రవాణా మంత్రికి ఫోన్ చేసి ఆరా తీయటం..అదే విధంగా అధికారులతో చర్చించటంతో మరోసారి గవర్నర్ తో సమావేశం కావాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు. గవర్నర్ అప్పాయింట్ మెంట్ ఇస్తే ఈ సాయంత్రమే కలిసే అవకాశం ఉంది. తాజాగా..సమ్మెలో ఉన్న క్యాబ్ జేఏసీ నేతలను ఆహ్వానించి..వారికి హామీ ఇచ్చి సమ్మె విరమించేలా వ్యవహరించిన గవర్నర్ తమ విషయంలోనూ పరిష్కారం చూపిస్తారనే ఆశతో ఉన్నారు. దీంతో..ఇప్పుడు గవర్నర్ తో మరోసారి ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ కానుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

సాయంత్రం గవర్నర్తో ఆర్టీసీ జేఏసీ సమావేశం
ఈ రోజు సాయంత్రం మరోసారి గవర్నర్ తమిళసైని కలువాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది. 16వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్ను కోరాలని జేఏసీ భావిస్తోంది. ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోరాదని, విజయం సాధించేవరకు పోరాడుదామని చెబుతున్న జేఏసీ నేతలు... కార్మికుల ప్రయోజనాలు కాపాడటమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. ఇక, ఇదే సమయంలో హైకోర్టు చర్చలు జరపాలని సూచనలు చేసినా ప్రభుత్వం నుండి స్పందన రాకపోవటంతో..ఇక, ఆర్టీసీ జేఏసీ మరో సారి గవర్నర్ ను కలిసి జోక్యం చేసుకోవాలని కోరాలని నిర్ణయించారు. సమ్మె ప్రారంభమైన తరువాత ఇదే జేఏసీ నేతలు గవర్నర్ ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఆ తరువాత గవర్నర్ నేరుగా రవాణా మంత్రి అజయ్ తో మాట్లాడి సమ్మె విషయంలో ప్రభుత్వ వైఖరి గురించి ఆరా తీసారు. అధికారులతో నూ ఇదే అంశం పైన చర్చలు జరిపారు. ఇక, ఇప్పుడు తిరిగి గవర్నర్ వద్దకు వెళ్లటం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకం జేఏసీ నేతల్లో కనిపిస్తోంది.

క్యాబ్ సమ్మె విరమణలో కీలక పాత్ర..
గవర్నర్ తమిళసై ఆర్టీసీ సమ్మె సాగుతున్న సమయంలోనే క్యాబ్ డ్రైవర్ల జేఏసీ సైతం సమ్మెకు దిగింది. దీంతో..గవర్నర్ నేరుగా జోక్యం చేసుకున్నారు. వారితో చర్చించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తనకు రెండు లేదా మూడు రోజుల సమయం ఇస్తే అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తానని..ఇప్పుడున్న పరిస్థితుల్లో సమ్మె సరి కాదని నచ్చ చెప్పారు. సమ్మె విరమించాలని కోరారు. దీంతో వారు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. తాము సైతం కలిసిన సందర్భంలో గవర్నర్ స్పందన చూసిన ఆర్టీసీ జేఏసీ ఇప్పుడు ప్రభుత్వం కంటే గవర్నర్ నుండే పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది. కోర్టు చెప్పినా..ఇప్పటి వరకు చర్చలకు పిలవకపోవటంతో ప్రభుత్వ వైఖరి కార్మికులకు స్పష్టమైంది. దీంతో..దీనిని తమ వంతు పరిష్కారం వెతికే ప్రయత్నం లో భాగంగా మరో సారి గవర్నర్ ను కలవాలని నిర్ణయించారు. గవర్నర్ అంగీకరిస్తే ఈ సాయంత్రమే వారు కలిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి సైతం రవాణా మంత్రితో సహా అధికారులను తన వద్దకు రావాలని సమాచారం పంపారు.

ప్రగతి భవన్ సమావేశంలో..
అఖిల పక్ష సమావేశ నిర్ణయాలు బయటకు రాగానే..ముఖ్యమంత్రి వద్ద మరోసారి ఆర్టీసీ సమ్మె పైన సమీక్ష ఏర్పాటు చేసారు. ఇప్పటికే మంత్రి అజయ్ తో పాటుగా ఆర్టీసీ ఎండి ప్రగతి భవన్ కు చేరుకున్నారు. కార్మిక జేఏసీ నేతలు గవర్నర్ ను కలవాలని భావిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి ఎటువంటి సూచనలు చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. అయితే, సోమవారం నుండి విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం కానుండటంతో..రవాణా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల చర్చ పైనే ఈ సమావేశం ఏర్పాటు చేసారా..లేక, కోర్టు సూచనల మేరకు కార్మిక సంఘాలతో చర్చల గురించి నిర్ణయం తీసుకుంటారా అనే ఆసక్తి మొదలైంది. దీంతో..ఈ సాయంత్రానికి సమ్మె విషయంలో ఏదైనా సంకేతాలు..స్పష్టత వస్తుందా అనే ఆసక్తి నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications