కేసీఆర్, కేటీఆర్ కు సిట్ సమన్లు..! రేవంత్ కు బండి కీలక సూచన..!
తెలంగాణలో గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రాజకీయ ప్రత్యర్ధులతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని (phone tapping) ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఐపీఎస్ ప్రభాకర్ రావు సహా పలువురు కీలక నిందితుల్ని విచారిస్తున్న సిట్.. తదుపరి రాజకీయ నేతల్ని విచారణకు పిలువబోతోంది. ఈ పరిణామంపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు నోటీసులు జారీ చేయాలని సిట్ తీసుకున్న నిర్ణయాన్ని బండి సంజయ్ స్వాగతించారు. తనతో సహా ఎంతోమంది నేతల ఫోన్లను ట్యాప్ చేయించడమే కాకుండా, ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టి, ఆఖరికి కన్నబిడ్డ, అల్లుడి ఫోన్లనూ ట్యాప్ చేయించి, ఎంతో పేరున్న ఎస్ఐబీ వ్యవస్థను భ్రష్టు పట్టించారని బీఆర్ఎస్ నేతలపై బండి ఫైర్ అయ్యారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు నోటీసులు జారీ చేయాలని సిట్ నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాను. నాతో సహా ఎంతోమంది నేతల ఫోన్లను ట్యాప్ చేయించడమే కాకుండా, ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టి, ఆఖరికి కన్నబిడ్డ, అల్లుడి ఫోన్లనూ…
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 23, 2025
ఎస్ఐబీని అడ్డుపెట్టుకొని, బ్లాక్ మెయిల్ చేసి కాంట్రాక్టర్లు, లీడర్ల నుండి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయని ఆయన ఆరోపిచారు. వాటిపైనా సమగ్రంగా దర్యాప్తు చేయాలని కోరారు. కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొంటారా? లేక పూర్తిస్థాయిలో విచారణ జరిపి దోషులను తేల్చుతారా? అనేది అనుమానమే అన్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు సమయంలో ప్రారంభమైన టీవీ సీరియల్స్ అన్ని ఎపిసోడ్స్ కూడా పూర్తయ్యాయన్నారు. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉందన్నారరు. విచారణ అధికారులపై ఒత్తిడి తీసుకురాకుండా వారికి స్వేచ్ఛనివ్వాలని, ఫోన్ ట్యాపింగ్ సూత్రధారుల కుట్రలను బయటపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications