'సీఎం కెసిఆర్ను చంపుతాం': టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును చంపేస్తామని బెదిరింపు ఫోన్ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. బుధవారం కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ చెల్లెలి పెళ్లికి సీఎం కెసిఆర్ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో కోర్టుల ఎమ్మెల్యే విద్యాసాగర రావుకు నెట్ ఫోన్ నుంచి మంగళవారం నాడు బెదిరింపు ఫోన్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన పశువైద్య కళాశాల భవన ప్రారంభోత్సవం జరగనుంది. ఎంపీ కవితతో పాటు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరు కానున్నారు.
ఈ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే విద్యాసాగర రావు మంగళవారం మధ్యాహ్నం వచ్చారు. ఆ సమయంలో నెట్ నెంబర్ నుంచి ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసిన ఎమ్మెల్యే అవతలి వ్యక్తి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పక్కనే ఉన్న ఎస్సైకి ఫోన్ ఇచ్చి మాట్లాడమని చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే డిఎస్పీ దృష్టికి తీసుకు వెళ్లారు. అపరిచత వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ పైన పోలీసులు ఆరా తీస్తున్నారు.
నేడు మెట్పల్లికి సీఎం కెసిఆర్
ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ రోజు (బుధవారం) కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా సీఎం స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో జరగనున్న పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ సోదరి వివాహానికి హాజరవుతారు.
హైదరాబాద్ నుంచి ఉదయం 9.30 గంటలకు హెలీకాప్టర్లో బయలుదేరి, 10.30 గంటలకు మెట్పల్లి మినీ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 1.5 కి.మీ దూరంలోని ఫంక్షన్ హాల్కు రోడ్డు మార్గం ద్వారా వెళ్తారు. వధూవరులను ఆశీర్వదించి మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ బయలుదేరుతారు.