‘అంబేద్కర్’తో వానలు కురవవ్: ఊరికి కరువవని ఇందూరు జిల్లాలో పెత్తందారుల బెదిరింపులు
డెబ్బై ఏళ్లనాడు స్వతంత్ర్య భారతానికి దిశా నిర్దేశం చేసిన బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుచేస్తే వానలు పడవని, మనుష్యుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని పెత్తందారులు అడ్డు చెప్తున్నారు.
హైదరాబాద్: ఆయన భారత రాజ్యాంగ నిర్మాత.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చివరి రక్తపు బొట్టు వరకు తపించిన త్యాగశీలి.. ఆయన పేరు బీఆర్ అంబేద్కర్.. అంటరానితనం, అస్పృశ్యతను పార దోలడానికి సమాజానికి చైతన్యం నేర్పిన మహనీయుడు బీఆర్ అంబేద్కర్.. కానీ ఆయన విగ్రహం పెడితే ఆ ఊరికి కరువొస్తుందట. వానలు పడవంట.. మనం ప్రయోగించిన ఉపగ్రహాల సాక్షిగా ప్రక్రుతి ఎప్పుడు ప్రకోపిస్తుందో, ఎప్పుడు తుఫాను వస్తుందో, వర్షాభావ పరిస్థితులు ఎలా ఉంటాయో ముందే తెలిసిపోయే తరుణమిది.
కానీ ఆ గ్రామంలోని పెత్తందారులు మాత్రం 'నడిఊర్ల మాలోడి విగ్రహం ఎలా పెడ్తారు? వాడి విగ్రహం ఉంటే వానలు పడవు. ఊరికి కరువు వస్తది' అని అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనపై విష ప్రచారానికి పూనుకున్నారు. రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతాయని వెనుకబడిన సామాజిక తరగతుల వారినీ ఉసిగొల్పుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఇస్సపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టకుండా పెత్తందార్లు అడ్డుకుంటున్న వైనమిది..
ఎంతోకాలంగా రేకులపల్లిలో అంబేద్కర్ విగ్రహ స్థాపనకు యత్నాలు
రేకులపల్లి గ్రామంలో 150 దళిత, 80 ఇతర సామాజిక కులాల కుటుంబాలు ఉన్నాయి. జనాభా 1400 మంది ఉంటారు. దాని శివారు గ్రామం ఇస్సపల్లిలో ఎంతోకాలంగా ఊళ్లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని దళితులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బస్టాండ్ సమీపంలో విగ్రహం పెట్టుకుంటామన్న వారి అభ్యర్థన మేరకు గ్రామ పంచాయతీ తీర్మానించింది. గత నెల 13వ తేదీన సర్పంచ్ సఫియాబేగం, ఎంపీటీసీ పోషగౌడ్, గ్రామ కమిటీ సదర్ చైర్మన్ గంగియ నాయక్, ఇతర గ్రామ పెద్దలతో కలిసి దళితులు భూమిపూజ చేశారు. విగ్రహ నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి.
పెత్తందారుల అభ్యంతరం ఇలా
భూమిపూజ తర్వాత వారం రోజులకు జరిగిన గ్రామసభలో కొందరు పెత్తందార్లు విగ్రహ ప్రతిష్టాపనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఆ స్థలం తనదంటూ వివాదాన్ని తెరపైకి తెచ్చాడు. ఊర్లోని మరికొందర్ని పోగేసి దళితులపైకి ఉసిగొల్పాడు. 'నడిఊర్ల మాలోడి విగ్రహం ఎలా పెడ్తారు? వాడి విగ్రహం ఉంటే వర్షాలు పడవు. ఊరికి కరువు వస్తది' అంటూ దళితులను దూషించారు. నడి ఊర్లో కాక బయట పెట్టుకోవాలని బెదిరించారు. దీంతో దళితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తర్వాత గత ఎస్ఐ (వారం క్రితం బదిలీలు జరిగాయి) స్థలాన్ని పరిశీలించి దళితులకు మద్దతుగా నిలిచారు. దీంతో విగ్రహం పెడితే రాకపోకలకు అంతరాయం కలుగుతుందని వెనుకబడిన సామాజిక తరగతుల వారిని పెత్తందార్లు ఉసిగొల్పారు.
వివాదంపై ఇన్ చార్జి కలెక్టర్కు దళితుల ఫిర్యాదు
ఇలా తరచూ వివాదం సృష్టించడంతో పది రోజుల కింద నిజామాబాద్ ఇన్చార్జి కలెక్టర్ రవీందర్రెడ్డి, ఏసీపీ ఆనంద్కుమార్, తహసీల్దార్ రమేష్కు దళితులు ఫిర్యాదు చేశారు. నాటి నుంచి ఉన్నత అధికారుల చర్యల కోసం బాధితులు వేచి చూస్తూనే ఉన్నారు. కారకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఆదివారం ఇస్సపల్లికి రానున్నట్టు తెలిసింది. ఇరుగ్రూపుల మధ్య సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. ఇప్పటికే కిందిస్థాయి అధికారులకు దీనిపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. ఇప్పటివరకు ఏదో రూపంలో నిజామాబాద్ జిల్లాలో ఏదో ఒక రూపంలో దళితులపైనా, వెనుకబడిన సామాజిక తరగతులపైనా పెత్తందార్ల ఆగడాలు రోజురోజుకీ శృతిమించుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామ అభివ్రుద్ధి కమిటీ (వీడీసీ)ల ముసుగులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నదని, దీన్ని సర్కార్ చూసీ చూడనట్టు వదిలేయడం సరి కాదని అంటున్నారు.
సమస్య వస్తే హడావుడి.. తర్వాత రాజీ ధోరణి సరికాదు
సమస్య వచ్చినప్పుడే అధికారులు హడావుడి చేసి ఆ తర్వాత రాజీధోరణి అవలబించడం వరకే పరిమితం అవుతున్నారని స్థానికులు చెప్తున్నారు. ఇది పెత్తందార్లకు మరింత అవకాశం ఇచ్చినట్టు అవుతున్నదని ఆందోళన చెందుతున్నారు. ఆర్మూర్ ఏరియాలో వీడీసీ ముసుగులో, ప్రజాప్రతినిధుల అండదండలతో పెత్తందార్లు సాగిస్తున్న ఆగడాలకు సర్కారు అడ్డుకట్ట వేయాలని, లేకపోతే పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు. గ్రామ పంచాయతీ తీర్మానం మేరకే భూమిపూజ చేశారని ఎంబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దండి వెంకట్ చెప్పారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం ప్రతిపాదించిన ఆ భూమి ఇతరులదని పత్రాలు చూపెడితే తామే పక్కన విగ్రహాన్ని పెట్టుకుంటామని దళితులు చెప్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దండి వెంకట్ డిమాండ్ చేశారు. మరోవైపు ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లో వీడీసీ ఆధిపత్యం పెరిగినా పోలీసులు చర్యలు చేపట్టడం లేదని, అధికార పార్టీ ఎమ్మెల్యేల అండదండలతో జరుగుతున్న బహిష్కరణలు, దాడులను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామాల్లో కళాబృందాల ద్వారా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని ఎంబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దండి వెంకట్ కోరారు.